పాక్ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ (జేఏఏసీ)’ చేపట్టిన లాంగ్ మార్చ్ సందర్భంగా జరిగిన హింసలో కనీసం 20 మంది మృతి చెందారు. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని సమాచారం.

జేఏఏసీ మంగళవారం ఎక్స్‌లో చేసిన పోస్టు ప్రకారం.. లాంగ్ మార్చ్ బృందాలు రావల్‌కోట్‌కు చేరుకున్నాయి. ఇప్పటివరకు 19 మంది మృతుల గుర్తింపును నిర్ధారించామని తెలిపింది. తలకు బుల్లెట్ గాయం అయిన మరో వ్యక్తి వద్ద గుర్తింపు పత్రాలు లేకపోవడంతో మొత్తం మృతుల సంఖ్య 20కి చేరిందని పేర్కొంది. పరిస్థితులు సాధారణమైన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడిస్తామని తెలిపింది.

జేఏఏసీ, పాకిస్థాన్ అధికారుల మధ్య చర్చలు విఫలం కావడంతో ఈ లాంగ్ మార్చ్ చేపట్టారు. ఆదివారం మీర్‌పూర్ డివిజన్ నుంచి ప్రారంభమైన నిరసన ర్యాలీ సోమవారం ముజఫరాబాద్ వైపు సాగింది. మరోవైపు పాక్ భద్రతా బలగాలు శాంతియుత నిరసనకారులపై సోమవారం సాయంత్రం కాల్పులు, టియర్ గ్యాస్‌, భారీ బలప్రయోగానికి పాల్పడ్డాయని ‘యునైటెడ్ కశ్మీర్ పీపుల్స్ నేషనల్ పార్టీ’ (యూకేపీఎన్‌పీ) ఆరోపించింది. దీంతో పలువురు మృతి చెందగా, మరికొందరు గాయపడ్డారని పేర్కొంది.

ఈ ఘటనపై ఐక్యరాజ్యసమితి, అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు వెంటనే జోక్యం చేసుకోవాలని యూకేపీఎన్‌పీ కోరింది. శాంతియుత నిరసనకారులపై కాల్పులు, అధిక బలప్రయోగాన్ని నిలిపివేయాలని పాకిస్థాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. మరోవైపు పీఓకేలో జరుగుతున్న నిరసనలపై భారత విదేశాంగ శాఖ గత నెల స్పందించింది. అక్కడ పోలీసుల దౌర్జన్యాల్లో పలువురు మరణించారని, అనేక మంది గాయపడ్డారని పేర్కొంటూ పాకిస్థాన్‌ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీగా నిలపాలని ఆశిస్తున్నట్లు విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు.