‘తెహల్కా’ పత్రిక మాజీ ఎడిటర్ తరుణ్ తేజ్‌పాల్‌ కు బాంబే హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. 2013 నాటి సంచలనాత్మక లైంగిక దాడి కేసులో ఆయనను విచారణ కోర్టు నిర్దోషిగా ప్రకటిస్తూ ఇచ్చిన ఉత్తర్వులను బాంబే హైకోర్టు రద్దు చేసింది. ఈ కేసులో తేజ్‌పాల్‌ను దోషిగా నిర్ధారిస్తూ ధర్మాసనం సంచలన తీర్పు వెలువరించింది.

 

2013 నవంబరులో గోవాలో జరిగిన ‘థింక్‌ఫెస్ట్’ ఈవెంట్ సమయంలో హోటల్ లిఫ్ట్‌లో తనపై తేజ్‌పాల్ లైంగిక దాడికి పాల్పడ్డారని ఆయన వద్ద పనిచేసిన ఒక మహిళా జర్నలిస్ట్ ఫిర్యాదు చేశారు. ఈ కేసును విచారించిన గోవాలోని మాపుసా సెషన్స్ కోర్టు 2021లో తేజ్‌పాల్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పునిచ్చింది. అయితే, ఈ ‘అక్విట్టల్’ తీర్పును సవాలు చేస్తూ గోవా ప్రభుత్వం బాంబే హైకోర్టులో అప్పీలు చేసింది.

 

గోవా ప్రభుత్వం తరఫున సోలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, తేజ్‌పాల్ తరఫున సీనియర్ అడ్వకేట్ ఆబాద్ పోండా సుదీర్ఘ వాదనలు వినిపించారు. ఘటన తర్వాత బాధితురాలి ప్రవర్తనను విచారణ కోర్టు తప్పుగా అంచనా వేసిందని, ఆధారాలను సరిగ్గా పరిగణనలోకి తీసుకోలేదని ప్రభుత్వం వాదించింది. 

 

ఇరుపక్షాల వాదనలు పరిశీలించిన జస్టిస్ డాక్టర్ నీలా గోఖలే, జస్టిస్ అమిత్ జమ్‌సాండేకర్‌లతో కూడిన డివిజన్ బెంచ్.. విచారణ కోర్టు నిర్ణయాన్ని తప్పుబడుతూ, ఐపీసీలోని రేప్ నిబంధనల ప్రకారం తరుణ్ తేజ్‌పాల్‌ను దోషిగా ఖరారు చేసింది. 

ఆ సమయంలో కోర్టు హాలులోనే వున్న తేజ్ పాల్ తన వయసును (ప్రస్తుతం 62 సంవత్సరాలు) దృష్టిలో పెట్టుకుని కనికరం చూపాలని వేడుకున్నారు. కాగా, నేటి మధ్యాహ్నం 2.30 గంటలకు శిక్షను ఖరారు చేస్తారు. కేసు తీవ్రతను బట్టి కనీసం 10 సంవత్సరాల జైలుశిక్ష పడుతుందని భావిస్తున్నారు.