మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్‌లో 24 గంటల వ్యవధిలో 10 మంది అదృశ్యం కావడం ఆందోళన కలిగిస్తోంది. వీరిలో ఇద్దరు మైనర్లు కూడా ఉన్నారు. నగరంలోని పలు పోలీస్ స్టేషన్ పరిధుల్లో కుటుంబ సభ్యులు ఫిర్యాదులు చేయడంతో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. కొందరి మొబైల్ ఫోన్లు ఇంటి నుంచి వెళ్లిన కాసేపటికే స్విచ్ ఆఫ్ కావడంతో వారి ఆచూకీ కనిపెట్టడం కష్టంగా మారింది.

కోలార్, అయోధ్యా నగర్ పోలీస్ స్టేషన్ పరిధుల్లో అత్యధికంగా మూడు చొప్పున మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అశోక్ గార్డెన్, టీటీ నగర్, రతీబాద్, అవధ్‌పురి పోలీస్ స్టేషన్ పరిధుల్లోనూ కేసులు నమోదయ్యాయి. అశోక్ గార్డెన్‌లో 17 ఏళ్ల విద్యార్థిని ట్యూషన్‌కు వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబ సభ్యులు స్వయంగా వెతికినా సమాచారం లభించకపోవడంతో పోలీసులను ఆశ్రయించారు.

అయోధ్యా నగర్ పరిధిలో 19 ఏళ్ల గరిమా, 24 ఏళ్ల తను, 22 ఏళ్ల మనీశ్ అదృశ్యమైనట్లు ఫిర్యాదులు అందాయి. కోలార్ పరిధిలో 20 ఏళ్ల శివకాంత్, 40 ఏళ్ల అమర్‌జీత్, 45 ఏళ్ల తులసీరామ్ కనిపించకుండా పోయారు. టీటీ నగర్‌కు చెందిన ముస్కాన్, రతీబాద్‌కు చెందిన 30 ఏళ్ల అన్మోల్ సోనీ, అవధ్‌పురి పరిధిలోని 16 ఏళ్ల బాలిక అదృశ్యమైన వారి జాబితాలో ఉన్నారు.

ప్రతి మిస్సింగ్ కేసును అత్యంత ప్రాధాన్యంతో దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. కుటుంబ సభ్యులను ప్రశ్నించడంతో పాటు సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తున్నారు. రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు, ఇతర రద్దీ ప్రాంతాల్లో గాలింపు కొనసాగుతోంది. మొబైల్ ఫోన్ లొకేషన్లు, కాల్ వివరాలను సైబర్ బృందం విశ్లేషిస్తోందని అదనపు పోలీస్ కమిషనర్ శైలేంద్ర సింగ్ చౌహాన్ వెల్లడించారు. అదృశ్యమైన వారి గురించి సమాచారం ఉంటే వెంటనే సమీప పోలీస్ స్టేషన్‌కు తెలియజేయాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.