తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారంటీలలో భాగంగా అమలు చేస్తున్న ప్రతిష్ఠాత్మక ‘మహాలక్ష్మి’ పథకాన్ని మరింత మందికి చేరువ చేసేందుకు చర్యలు వేగవంతం చేసింది. ఈ పథకంలో భాగమైన రూ.500కే గ్యాస్ సిలిండర్ సదుపాయాన్ని కొత్తగా మరో 5 లక్షలకు పైగా పేద కుటుంబాలకు విస్తరించాలని నిర్ణయించింది. ఇందుకు సంబంధించిన అర్హుల జాబితాను పౌరసరఫరాల శాఖ సిద్ధం చేసి, ఆమోదం కోసం ఆర్థిక శాఖకు పంపింది. ఆర్థిక శాఖ నుంచి గ్రీన్ సిగ్నల్ లభించి, నిధులు విడుదలైన వెంటనే కొత్త లబ్ధిదారులకు సబ్సిడీ అందనుంది.
ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 42.90 లక్షల కుటుంబాలు ఈ పథకం ద్వారా లబ్ధి పొందుతున్నాయి. 2024 ఫిబ్రవరిలో ప్రభుత్వం ఈ పథకంపై అధికారిక నోటిఫికేషన్ విడుదల చేయగా, 'ప్రజా పాలన' కార్యక్రమం ద్వారా దాదాపు 91.49 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. దరఖాస్తుల పరిశీలన అనంతరం తొలి దశలో 42.90 లక్షల మందిని అర్హులుగా గుర్తించారు. ఈ లబ్ధిదారుల గ్యాస్ సబ్సిడీ రీయింబర్స్మెంట్ కోసం ప్రభుత్వం వార్షిక బడ్జెట్లో రూ. 723.30 కోట్లు కేటాయించింది.
రాష్ట్రంలో 1.20 కోట్లకు పైగా గ్యాస్ కనెక్షన్లు ఉన్నప్పటికీ, తెల్ల రేషన్ కార్డు ఉన్న కుటుంబాలకే ఈ పథకాన్ని వర్తింపజేస్తున్నారు. గతంలో వివాహం చేసుకొని కొత్తగా కాపురం పెట్టిన జంటలకు వేరుగా రేషన్ కార్డులు లేకపోవడం, ఒకే ఇంట్లో రెండు కుటుంబాలు ఉన్నా ఒకే కార్డు ఉండటం వంటి కారణాలతో చాలామంది అర్హులు పథకానికి దూరమయ్యారు. అయితే, ప్రభుత్వం 2025 జనవరి నుంచి 2026 జులై మధ్య కాలంలో పెద్ద ఎత్తున కొత్త రేషన్ కార్డులను జారీ చేసింది.
ఈ కొత్త రేషన్ కార్డులు పొందిన వారు మహాలక్ష్మి పథకం కోసం మళ్లీ దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించిన పౌరసరఫరాల శాఖ, 5 లక్షలకు పైగా కుటుంబాలను అర్హులుగా నిర్ధారించింది. ఆర్థిక శాఖ నుంచి అనుమతులు రాగానే ఉమ్మడి జిల్లాల వారీగా కొత్త లబ్ధిదారుల జాబితాను విడుదల చేస్తామని అధికారులు తెలిపారు. అనంతరం సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తారు.
‘మహాలక్ష్మి’ పథకం విస్తరణ.. మరో 5 లక్షల కుటుంబాలకు రూ.500 గ్యాస్..
