మధుమేహం ఇప్పుడు ప్రతి ఇంట్లో వినిపిస్తున్న ఆరోగ్య సమస్య. మందులు, వ్యాయామం ఎంత ముఖ్యమో.. రోజువారీ ఆహారం కూడా అంతే కీలకం. ఏం తింటున్నామనేది మాత్రమే కాదు, ఎప్పుడు తింటున్నామన్నదీ రక్తంలో చక్కెర స్థాయులపై ప్రభావం చూపుతుంది. ఈ క్రమంలో భోజనానికి ముందు మొలకెత్తిన మెంతులు తినడం వల్ల షుగర్ ఒక్కసారిగా పెరగకుండా కొంతవరకు నియంత్రించవచ్చని పలు పరిశోధనలు సూచిస్తున్నాయి. అయితే ఇది అద్భుత ఔషధం కాదని, ఆరోగ్యకరమైన జీవనశైలిలో భాగంగా మాత్రమే చూడాలని వైద్య నిపుణులు చెబుతున్నారు.

మొలకలతో పోషక విలువ
సాధారణ మెంతులతో పోలిస్తే మొలకెత్తిన మెంతుల్లో పోషకాలు శరీరానికి సులభంగా అందుతాయి. మొలకలు వచ్చిన తర్వాత యాంటీ ఆక్సిడెంట్లు పెరుగుతాయి. జీర్ణం కూడా సులభమవుతుంది. ఖనిజాలు, ప్లాంట్‌ ప్రొటీన్లు, పీచు పదార్థాలు సమృద్ధిగా లభిస్తాయి. అందుకే వీటిని సాధారణ గింజల కంటే మరింత ప్రయోజనకరంగా భావిస్తున్నారు.

షుగర్ నియంత్రణకు ఎలా తోడ్పడతాయి?
మొలకెత్తిన మెంతుల్లో కరిగే పీచు ఎక్కువగా ఉంటుంది. ఇది కార్బోహైడ్రేట్లు నెమ్మదిగా జీర్ణమయ్యేలా చేస్తుంది. ఫలితంగా భోజనం తర్వాత రక్తంలో చక్కెర ఒక్కసారిగా పెరిగే అవకాశం తగ్గుతుంది. గ్యాలాక్టోమన్నాన్, 4-హైడ్రాక్సీ ఐసోల్యూసిన్ వంటి సహజ పదార్థాలు గ్లూకోజ్‌ను శరీరం గ్రహించే వేగాన్ని తగ్గించడంలో, ఇన్సులిన్ పనితీరుకు తోడ్పడటంలో కీలక పాత్ర పోషిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

భోజనానికి ముందే ఎందుకు తినాలి?
మధ్యాహ్న భోజనానికి ముందు కొద్దిపాటి మెంతి మొలకలు తింటే కడుపు నిండిన భావన కలుగుతుంది. దీంతో అతిగా తినే అలవాటు తగ్గే అవకాశం ఉంటుంది. ఆహారం నెమ్మదిగా జీర్ణమవడం వల్ల ఎనర్జీ లెవెల్స్‌ స్థిరంగా ఉండేందుకు కూడా తోడ్పడొచ్చు. జీర్ణక్రియ, గట్‌ హెల్త్‌కు కూడా ఇవి మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇంట్లోనే సులభంగా తయారు చేసుకోవచ్చు
మెంతులను రాత్రంతా నీటిలో నానబెట్టాలి. మరుసటి రోజు నీరు వంపేసి శుభ్రమైన పలుచని వస్త్రంలో కట్టాలి. 24 నుంచి 48 గంటల్లో మొలకలు వస్తాయి. ఈ సమయంలో తేమ ఎక్కువగా లేకుండా చూసుకోవాలి. లేకపోతే బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఉంటుంది. మొలకలు వచ్చిన వెంటనే తాజాగా తీసుకోవడం మంచిది.

అందరికీ పడకపోవచ్చు
మధుమేహానికి మందులు వాడేవారు వైద్యుల సలహాతోనే మెంతి మొలకలను ఆహారంలో చేర్చుకోవాలి. ఎందుకంటే రక్తంలో చక్కెర మరీ ఎక్కువగా తగ్గే అవకాశం ఉంటుంది. గర్భిణులు, జీర్ణ సమస్యలు ఉన్నవారు కూడా వైద్యులను సంప్రదించడం మంచిది. మెంతి మొలకలు ఆరోగ్యకరమైన ఆహారంలో భాగమే తప్ప, మందులకు ప్రత్యామ్నాయం కావని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. సమతుల ఆహారం, వ్యాయామం, వైద్యుడు సూచించిన చికిత్స కొనసాగిస్తేనే పూర్తి ప్రయోజనం ఉంటుంది.