ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రెండు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగుదేశం పార్టీ (టీడీపీ) రాష్ట్రవ్యాప్తంగా భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పార్టీ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు నారా లోకేశ్ పిలుపు మేరకు 45 రోజుల పాటు 'ఇంటింటి ప్రచారం' నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు రాష్ట్రంలోని ప్రతి ఇంటినీ పలకరిస్తూ ప్రజలతో మమేకమవుతున్నాయి.
ఈ ప్రచారంలో భాగంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, నియోజకవర్గ ఇన్చార్జులు, ఇతర ప్రజాప్రతినిధులు, లక్షలాది మంది కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొంటున్నారు. గత రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి, సంక్షేమం, సుపరిపాలన విజయాలను ప్రతి కుటుంబానికి చేరవేస్తున్నారు. ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు, వారి అభిప్రాయాలు, సూచనలను నేరుగా స్వీకరిస్తున్నారు.
క్షేత్రస్థాయిలో ప్రజలు ఎదుర్కొంటున్న స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుంటున్నారు. గ్రామాలు, పట్టణాలు, నగరాల్లో విస్తృతంగా కొనసాగుతున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోందని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ప్రభుత్వం, ప్రజల మధ్య అనుబంధాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ కార్యక్రమం విజయవంతంగా ముందుకు సాగుతోంది.
కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలన సందర్భంగా టీడీపీ ప్రచారం..
