పార్లమెంట్ తిరిగి సజావుగా సాగాలని, విద్యార్థుల ఆందోళనలను సభలో చర్చించాలని కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ అన్నారు. పబ్లిక్ ఎగ్జామినేషన్స్ (ప్రివెన్షన్ ఆఫ్ అన్‌ఫెయిర్ మీన్స్) సవరణ బిల్లు-2026పై లోక్‌సభలో జరిగే చర్చలో ప్రతిపక్షం పాల్గొనే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. దేశవ్యాప్తంగా విద్యార్థులను ప్రభావితం చేస్తున్న అంశాలపై పార్లమెంట్‌లో సమగ్ర చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు.

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా ఈ బిల్లుపై మధ్యాహ్నం 2 గంటలకు చర్చ చేపడతామని ప్రకటించిన తర్వాత థరూర్ మీడియాతో మాట్లాడారు. విద్యార్థుల గొంతు పార్లమెంట్‌లో వినిపించాల్సిన బాధ్యత ప్రతిపక్షంపై ఉందన్నారు. ఈ బిల్లు పరీక్షల ప్రశ్నపత్రాల లీకేజీ సమస్యకు నిజంగా పరిష్కారం చూపుతుందా లేదా అనే అంశాన్ని ప్రతిపక్షం నిశితంగా పరిశీలిస్తుందని చెప్పారు.

ఫాస్ట్‌ట్రాక్ కోర్టులు ఏర్పాటు చేయడం, కొన్ని నిబంధనలు మార్చడం మాత్రమే సరిపోతుందా? విద్యార్థుల భవిష్యత్తును నిజంగా కాపాడగలదా? అనే ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాల్సి ఉందని థరూర్ అన్నారు. ఒక్క మంత్రి రాజీనామాతో సమస్య పరిష్కారం కాదని, మొత్తం పరీక్షల వ్యవస్థలో సమగ్ర సంస్కరణలు అవసరమని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వ జవాబుదారీతనమే ముఖ్యమని పేర్కొన్నారు.

మాజీ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా అనంతరం పార్లమెంట్‌కు వచ్చినప్పుడు ఆయనకు స్వాగతం పలకడంపై కూడా థరూర్ స్పందించారు. నైతిక బాధ్యత వహిస్తూ రాజీనామా చేసిన మంత్రిని హీరోలా స్వాగతించడం ఆందోళన కలిగించే విషయమన్నారు. పరీక్షల వ్యవస్థ వైఫల్యంతో నష్టపోయిన విద్యార్థులు, వారి కుటుంబాల మనోభావాలను అలా వ్యవహరించిన వారు అర్థం చేసుకోలేదని విమర్శించారు.