బాలీవుడ్ నటి శిల్పాశెట్టి తన పేరుతో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక నకిలీ పోస్టుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలోని రిజర్వేషన్ల వ్యవస్థపై తాను స్పందించినట్లుగా జరుగుతున్న ప్రచారాన్ని ఆమె తీవ్రంగా ఖండించారు. అదంతా పూర్తిగా కల్పితమని, దురుద్దేశంతో చేస్తున్న తప్పుడు ప్రచారమని ఆమె కొట్టిపారేశారు. ఇటువంటి తప్పుడు వార్తలను ఎవరూ నమ్మవద్దని ఆమె ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

శిల్పాశెట్టి ఇన్‌స్టాగ్రామ్ ఖాతా నుంచి పోస్ట్ చేసినట్లుగా ఉన్న ఒక స్క్రీన్‌షాట్ ఇటీవల సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. "జనరల్ కేటగిరీ వైద్యులు కేవలం జనరల్ కేటగిరీ రోగులకు మాత్రమే చికిత్స చేయాలి. ఇతర కులాల వైద్యులు వారి వారి కులాల వారికి మాత్రమే చికిత్స అందిస్తే, రిజర్వేషన్లు వద్దనే డిమాండ్ వస్తుంది. రిజర్వేషన్ ద్వారా నైపుణ్యం రాదు" అని ఆ పోస్టులో పేర్కొన్నారు.

ఈ ప్రచారంపై శిల్పాశెట్టి 'ఎక్స్' వేదికగా స్పందిస్తూ వివరణ ఇచ్చారు. "రిజర్వేషన్లపై నా పేరుతో ఇటువంటి తప్పుడు ప్రకటనలు వైరల్ కావడం చూసి దిగ్భ్రాంతికి గురయ్యాను. ఇది పూర్తిగా కల్పితం మరియు దురుద్దేశపూర్వక ప్రచారం. దయచేసి ఇటువంటి నకిలీ వార్తలను నమ్మకండి" అని ఆమె పోస్ట్ చేశారు. అయితే, సదరు పోస్టును ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) సాంకేతికతతో సృష్టించి ఉండవచ్చని భావిస్తున్నారు.