మార్కెట్‌ నుంచి తెచ్చిన పండ్లు, కూరగాయలు రెండు రోజుల్లోనే పాడైపోతుంటే బాధగా అనిపిస్తుంది. సరైన విధంగా నిల్వ చేయకపోవడమే దీనికి ప్రధాన కారణం. ప్రతి పండు, ప్రతి కూరగాయ నిల్వ కాలం ఒకేలా ఉండదు. ఉష్ణోగ్రత, తేమ, గాలి, వెలుతురు, పక్కన ఉంచే ఇతర పండ్లు కూడా వాటి తాజాదనాన్ని ప్రభావితం చేస్తాయి. ఇండియా టుడే కథనం ప్రకారం... కొన్ని చిన్న జాగ్రత్తలు తీసుకుంటే ఆహార వ్యర్థాలు తగ్గడంతో పాటు ఆరోగ్య సమస్యల ప్రమాదం కూడా తగ్గుతుంది.

గది ఉష్ణోగ్రతలో యాపిల్స్ వారం రోజుల వరకు తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో పెడితే మూడు నుంచి నాలుగు వారాల వరకు నిల్వ ఉంటాయి. 

అరటిపండ్లు రెండు నుంచి ఏడు రోజుల వరకు బయటే ఉంచాలి. పూర్తిగా పండిన తర్వాతే ఫ్రిజ్‌లో పెట్టాలి. 

బెర్రీలు మూడు నుంచి ఏడు రోజుల వరకు ఫ్రిజ్‌లో తాజాగా ఉంటాయి. వాటిని కడగకుండా నిల్వ చేసి, తినే ముందు మాత్రమే శుభ్రం చేయాలి.

నారింజ, బత్తాయి వంటి సిట్రస్ పండ్లు బయట వారం రోజులు, ఫ్రిజ్‌లో నెల రోజుల వరకు నిల్వ ఉంటాయి. 

ద్రాక్ష రెండు వారాల వరకు ఫ్రిజ్‌లో తాజాగా ఉంటుంది. టమాటాలను ముందుగా బయట పండించి, తర్వాత ఫ్రిజ్‌లో పెడితే రెండు వారాల వరకు నిల్వ ఉంటాయి.

కూరగాయల్లో క్యారెట్, పార్స్‌నిప్‌లు చల్లని ప్రదేశంలో రెండు వారాలు, ఫ్రిజ్‌లో నెలకుపైగా తాజాగా ఉంటాయి. 

దోసకాయను ఫ్రిజ్‌లో వారం రోజుల వరకు నిల్వ చేయొచ్చు. కోసిన తర్వాత మాత్రం ఒకటి లేదా రెండు రోజుల్లోనే వాడేయాలి. 

లెట్యూస్ మూడు నుంచి ఏడు రోజులు ఫ్రిజ్‌లో నిల్వ ఉంటుంది. పుట్టగొడుగులు బయట ఒక రోజు మాత్రమే తాజాగా ఉంటాయి. ఫ్రిజ్‌లో మూడు నుంచి ఏడు రోజులు నిల్వ ఉంటాయి. 

ఉల్లిపాయలను చల్లగా, పొడిగా, గాలి బాగా వచ్చే చోట ఉంచితే ఆరు వారాలకుపైగా నిల్వ ఉంటాయి. బంగాళాదుంపలు కూడా చీకటి, పొడి ప్రదేశంలో ఆరు వారాలకుపైగా తాజాగా ఉంటాయి.

అన్ని పండ్లు, కూరగాయలు కొద్దిగా మెత్తబడితే పారేయాల్సిన అవసరం లేదు. స్వల్పంగా దెబ్బతిన్న యాపిల్స్, గోధుమరంగులోకి మారిన అరటిపండ్లు, మెత్తబడిన టమాటాలు బూజు పట్టకపోతే తినవచ్చు. అయితే బెర్రీలు, ద్రాక్షపై బూజు కనిపిస్తే మొత్తం పారేయడం మంచిది. ఎందుకంటే బూజు విషపదార్థాలు మిగతా పండ్లకూ వ్యాపించే అవకాశం ఉంటుంది. 

ఆకుపచ్చగా మారిన లేదా మొలకెత్తిన బంగాళాదుంపలను అసలు వాడకూడదు. వాటిలో ఉండే సహజ విషపదార్థాలు వంట చేసినా పూర్తిగా తొలగిపోవు.

పండ్లు, కూరగాయలు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే కొన్ని చిట్కాలు తప్పనిసరి. వాటికి తగిన ఉష్ణోగ్రతలోనే నిల్వ చేయాలి. నిల్వ చేసే ముందు కడగకుండా, తినే ముందు మాత్రమే శుభ్రం చేయాలి. ఉల్లిపాయలను బంగాళాదుంపలతో కలిపి ఉంచకూడదు. 

యాపిల్స్, అరటిపండ్లను ఇతర పండ్లకు దూరంగా ఉంచాలి. ఎందుకంటే అవి విడుదల చేసే ఇథిలీన్ వాయువు మిగతా పండ్లు త్వరగా పండిపోయి పాడవడానికి కారణమవుతుంది. అవసరానికి తగ్గట్టే కొనుగోలు చేస్తే ఆహార వ్యర్థాలు కూడా గణనీయంగా తగ్గుతాయి.