పాన్ ఇండియా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హైదరాబాద్‌లో తన అభిమానులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. యూసుఫ్‌గూడలోని శౌర్య భవన్‌లో ‘అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్’ (AAFA) ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమం అత్యంత ఉత్సాహభరితంగా కొనసాగింది. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర ప్రాంతాల నుంచి వచ్చిన సుమారు 600 మందికి పైగా అభిమానులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా మాట్లాడిన బన్నీ... సోషల్ మీడియాలో వ్యక్తమయ్యే అనవసరపు ట్రోల్స్, నెగెటివిటీపై పరోక్షంగా స్పందించారు. నెట్టింట సాగే దుష్ప్రచారాలను, వివాదాలను అస్సలు పట్టించుకోవద్దని అభిమానులకు హితవు పలికారు. సానుకూల ధోరణితో ముందుకెళుతూ, తమ సమయాన్ని, శక్తిని మంచి కార్యాలకే వినియోగించాలని పిలుపునిచ్చారు.

 

అభిమానులు చూపుతున్న అమితమైన ఆప్యాయతకు బన్నీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. అనంతరం వారితో కలిసి గ్రూప్ ఫొటోలు దిగుతూ ఎంతో ఉత్సాహంగా గడిపారు. నెగెటివిటీకి దూరంగా ఉండాలని అల్లు అర్జున్ ఇచ్చిన సందేశానికి సోషల్ మీడియాలోనూ ప్రశంసలు దక్కుతున్నాయి. ఈ సమావేశంతో అభిమానులకు, ఐకాన్ స్టార్‌కు మధ్య ఉన్న అనుబంధం మరింత బలపడింది.