టీమిండియా మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ చాలా ప్రశాంతమైన, సాధారణ వ్యక్తి అని, సహచర ఆటగాళ్ల కోసం అత‌ని గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయని సీనియర్ క్రికెటర్ అజింక్యా రహానే అన్నాడు. ఇటీవల అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన రహానే, ధోనీతో తనకున్న అనుబంధాన్ని ఓ పాడ్‌కాస్ట్‌లో పంచుకున్నాడు.

రహానే మాట్లాడుతూ.. "ధోనీ చాలా కూల్, అందరిలాగే ఓ సాధారణ మనిషి. అత‌ని గది తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి. చాలాసార్లు మేం 10 నుంచి 15 మంది, కొన్నిసార్లు జట్టు మొత్తం ఆయన గదిలోనే ఉండేవాళ్లం. అయితే, అత‌ని గది తలుపు మూసి ఉంటే మాత్రం ఎవరూ లోపలికి వెళ్లే సాహసం చేసేవారు కాదు" అని గుర్తుచేసుకున్నాడు. రహానే తన అంతర్జాతీయ అరంగేట్రం (టెస్టు, వన్డే, టీ20) ధోనీ కెప్టెన్సీలోనే చేయడం, ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరఫున కూడా కలిసి ఆడటం గమనార్హం.

ఇదే సందర్భంగా తాను సిరీస్‌ల సమయంలో మానసిక ప్రశాంతత కోసం సోషల్ మీడియాకు పూర్తిగా దూరంగా ఉండేవాడిన‌ని రహానే వెల్లడించాడు. "సిరీస్ జరుగుతున్నప్పుడు నేను అన్ని సోషల్ మీడియా యాప్‌లను డిలీట్ చేస్తాను. 2017లో ఐపీఎల్‌లో కలిసి ఆడినప్పుడు ఇంగ్లండ్ ఆటగాడు బెన్ స్టోక్స్ ఈ సలహా ఇచ్చాడు. అప్పటినుంచి దీన్ని పాటిస్తున్నా" అని చెప్పాడు. గదిలో ఉన్నప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో ఏదైనా చూడటం, పుస్తకాలు చదవడం, కుటుంబంతో మాట్లాడటం వంటివి చేయడం ద్వారా మానసికంగా ఉల్లాసంగా ఉండేవాడిన‌ని రహానే వివరించాడు.