గుంటూరు తూర్పు నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత షేక్ ముస్తఫాకు కిడ్నాప్ కేసులో భారీ ఎదురుదెబ్బ తగిలింది. పొగాకు వ్యాపారి కుమారుడి కిడ్నాప్ ఆరోపణల నేపథ్యంలో ఆయనకు, ఆయన కుమారుడు బషీర్‌కు నూజివీడు న్యాయస్థానం 14 రోజుల రిమాండ్ విధించింది. ఈ కేసులో గుజరాత్‌లో అరెస్టయిన వారిని ఇవాళ‌ తెల్లవారుజామున న్యాయమూర్తి ఎదుట పోలీసులు హాజరుపరిచారు. విచారణ అనంతరం న్యాయమూర్తి రిమాండ్ ఆదేశాలు జారీ చేయడంతో నిందితులిద్దరినీ నెల్లూరు సబ్ జైలుకు తరలించారు.

ఏలూరు జిల్లా కొయ్యలగూడేనికి చెందిన ఓ వ్యాపారి గతంలో ముస్తఫాకు చెందిన పొగాకు గోదాముకు తన పంటను విక్రయించేవాడు. అయితే, ఇటీవల ధరల వ్యత్యాసం కారణంగా ఆయన మరో కంపెనీకి పొగాకు అమ్మడం మొదలుపెట్టాడు. ఈ వ్యాపార లావాదేవీల వివాదమే కిడ్నాప్‌కు దారితీసినట్లు తెలుస్తోంది.

కొయ్యలగూడెం నుంచి గుంటూరుకు పొగాకు బేళ్లతో వెళ్తున్న వ్యాపారి కుమారుడిని అడ్డగించి, వాహనం సహా కిడ్నాప్ చేశారని బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ విషయంపై ముస్తఫాకు ఫోన్ చేయగా, తనకు రావాల్సిన డబ్బులు చెల్లించి కొడుకును తీసుకెళ్లాలని బెదిరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నాడు.

దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, ముస్తఫా, ఆయన కుమారుడు గుజరాత్‌లో ఉన్నట్లు సాంకేతిక ఆధారాలతో గుర్తించారు. అక్కడికి వెళ్లి వారిద్దరినీ అదుపులోకి తీసుకుని నూజివీడుకు తరలించారు. కోర్టు ఆదేశాలతో ప్రస్తుతం వారిద్దరూ జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.