ఫోన్‌పే తన వినియోగదారులకు మరో కొత్త ఆర్థిక సేవను అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్రముఖ బ్యాంకులు, ఎన్‌బీఎఫ్‌సీల భాగస్వామ్యంతో ఫిక్స్‌డ్ డిపాజిట్ (ఎఫ్‌డీ) సేవలను ప్రారంభించింది. అదే సమయంలో ‘శివాలిక్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్‌’తో కలిసి రోజుకు రూ.100 నుంచే పొదుపు చేసే డైలీ రికరింగ్ డిపాజిట్ (డైలీ ఆర్‌డీ) సదుపాయాన్ని కూడా అందుబాటులోకి తెచ్చింది.

ఫోన్‌పే యాప్‌లోనే వివిధ బ్యాంకుల ఎఫ్‌డీలను పరిశీలించి, పోల్చి, వెంటనే బుక్ చేసుకునే అవకాశం కల్పించింది. భాగస్వామ్య బ్యాంకుల్లో చేసిన ఎఫ్‌డీలకు ఆర్‌బీఐ నిబంధనల ప్రకారం ‘డిపాజిట్ ఇన్సూరెన్స్ అండ్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్’ (డీఐసీజీసీ) నుంచి రూ.5 లక్షల వరకు బీమా రక్షణ ఉంటుంది.

కొత్తగా తీసుకొచ్చిన డైలీ ఆర్‌డీ ద్వారా రోజుకు రూ.100 నుంచి రూ.1,000 వరకు ఆటోమేటిక్‌గా పొదుపు చేయొచ్చు. యూపీఐ ఆటోపే ద్వారా ప్రతి రోజు నిర్ణయించిన మొత్తం జమ అవుతుంది. ఏడు రోజుల తర్వాత అవసరమైతే డబ్బు ఉపసంహరించుకోవచ్చు. వరుసగా 15 రోజుల పాటు చెల్లింపులు జరగకపోయినా ఎలాంటి జరిమానా ఉండదని ఫోన్‌పే తెలిపింది. అవసరమైతే ఎప్పుడైనా ఆటోపేను నిలిపివేసే అవకాశం కూడా ఉంది.

ఫోన్‌పే హోమ్ స్క్రీన్‌లోని మ్యూచువల్ ఫండ్స్ అండ్ డిపాజిట్ విభాగంలోకి వెళ్లి ఎఫ్‌డీ లేదా డైలీ ఆర్‌డీని ఎంపిక చేసుకోవచ్చు. అనంతరం బ్యాంకు, కాలపరిమితి, పెట్టుబడి మొత్తాన్ని ఎంచుకుని పాన్, ఆధార్‌తో డిజిటల్ ధ్రువీకరణ పూర్తి చేయాలి. తర్వాత యూపీఐ లేదా నెట్‌బ్యాంకింగ్ ద్వారా చెల్లింపు చేసి డిపాజిట్‌ను ప్రారంభించవచ్చు.