టీమిండియా వికెట్ కీపర్-బ్యాటర్ రిషబ్ పంత్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టించాడు. తన సొంత రాష్ట్రమైన ఉత్తరాఖండ్‌లో భూమి కొనుగోలు చేసేందుకు సాయం చేయాలంటూ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామికి అర్థరాత్రి వేళ చేసిన ట్వీట్లు ఇప్పుడు పెద్ద చర్చకు దారితీశాయి. ఇవాళ‌ తెల్లవారుజామున 12:46 గంటలకు పంత్ చేసిన ఈ పోస్టులలో వ్యాకరణ దోషాలు, స్పెల్లింగ్ తప్పులు ఎక్కువగా ఉండటంతో అవి క్షణాల్లో వైరల్ అయ్యాయి.

ఢిల్లీ నుంచి ఉత్తరాఖండ్‌కు తన నివాసాన్ని మార్చాలనుకుంటున్నానని, ఇందుకోసం చాలా కాలంగా ప్రయత్నిస్తున్నా సరైన భూమి దొరకడం లేదని పంత్ తన ట్వీట్‌లో పేర్కొన్నాడు. "హలో సార్, ఎలా ఉన్నారు? ఉత్తరాఖండ్‌కు చెందిన వాడిగా ఇక్కడ స్థిరపడాలని చూస్తున్నాను. భూమి కొనుగోలు చేయడం ఒక పీడకలలా మారింది. నా సొంత రాష్ట్రానికి తిరిగి వచ్చి, ఇక్కడి ప్రజలకు సేవ చేయాలని ఉంది. దయచేసి ఈ విషయంలో నాకు సహాయం చేయండి. మూడేళ్లుగా ప్రయత్నిస్తున్నా ఫలితం లేదు" అని సీఎంను ట్యాగ్ చేస్తూ పంత్ రాసుకొచ్చాడు.

ఈ పోస్ట్ చేసిన కొద్దిసేపటికే పంత్ మరో ట్వీట్ చేయడం గమనార్హం. "అంతర్జాతీయ స్థాయిలో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించినందుకు భూమిని గిఫ్ట్‌గా ఇస్తే సంతోషిస్తాను. ఒకవేళ మీరు అనుమతిస్తే, ప్రభుత్వ రేట్లకే కొనుగోలు చేస్తాను. దయచేసి సాయం చేయండి" అని రెండో ట్వీట్‌లో కోరాడు.

పంత్ చేసిన ఈ అసాధారణ విజ్ఞప్తిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. అర్థరాత్రి వేళ ఇన్ని తప్పులతో పోస్ట్ చేయడంపై పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. "అతను మద్యం సేవించాడా? రాత్రి 1 గంటకు ఇన్ని తప్పులతో అర్థం పర్థం లేకుండా మాట్లాడుతున్నాడు. భారత్ టెస్ట్ మ్యాచ్ ఆడాల్సి ఉండగా, అతను ఈ విషయాలతో బిజీగా ఉన్నాడు" అంటూ ఒక అభిమాని ఆందోళన వ్యక్తం చేశాడు.

ఇటీవలే శ్రీలంకతో జరగనున్న రెండు మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌కు పంత్ ఎంపికయ్యాడు. అంతకుముందు ఐపీఎల్ 2027 వేలానికి ముందు లక్నో సూపర్ జెయింట్స్ నుంచి ఢిల్లీ క్యాపిటల్స్‌కు రూ. 15 కోట్లకు ట్రేడ్ అయిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పంత్ చేసిన ట్వీట్లు క్రీడా వర్గాల్లోనూ చర్చనీయాంశంగా మారాయి.

ఇదిలాఉంటే.. ఈ ట్వీట్ల‌పై మ‌రికొంద‌రు అనుమానం వ్య‌క్తం చేస్తున్నారు. అస‌లు ఈ ట్వీట్స్ పంతే చేశాడా? లేక అత‌ని ఖాతా ఏమైనా హ్యాక్ అయిందా? అంటూ అనుమానిస్తున్నారు. దీనిపై స్వ‌యంగా పంత్ స్పందిస్తే గానీ క్లారిటీ వ‌చ్చే అవ‌కాశం లేదు.