బెంగళూరు నగరంలో ఓ విషాద ఘటన వెలుగులోకి వచ్చింది. బాగలగుంటె ప్రాంతంలోని ఓ డూప్లెక్స్ ఇంట్లో సుమారు ఏడాదిగా ఎవరి కంటా పడకుండా ఉన్న 52 ఏళ్ల మహిళ అస్థిపంజరాన్ని పోలీసులు కనుగొన్నారు. మృతురాలిని దాక్షాయిణిగా గుర్తించారు.

వివరాల్లోకి వెళితే.. బాగలగుంటెలోని హవనూర్ లేఅవుట్‌లో దాక్షాయిణి ఒంటరిగా నివసిస్తున్నారు. సుమారు 10 ఏళ్ల క్రితం ఆమె భర్త ఉమేశ్ మరణించారు. ఆ తర్వాత కొడుకు కూడా క్యాన్సర్‌తో చనిపోవడంతో ఆమె తీవ్ర డిప్రెషన్‌లోకి వెళ్లినట్లు సమాచారం. అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తున్నారు.

దాదాపు ఏడాది క్రితమే ఆమె మరణించి ఉండవచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. ఈ ఏడాది కాలంలో ఆమె కూతురు, అల్లుడు కూడా ఇంటికి వచ్చి చూడలేదని తెలుస్తోంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో ఆమె మరణం ఇన్నాళ్లూ రహస్యంగానే ఉండిపోయింది.

సమాచారం అందుకున్న బాగలగుంటె పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఇంటిని పరిశీలించారు. అస్థిపంజరాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఆమె మృతికి గల కచ్చితమైన కారణాలు, పరిస్థితులపై ఆరా తీస్తున్నారు. మహానగరంలో ఇలాంటి ఘటన జరగడం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.