ఓ విమాన ప్రయాణానికి ముందు క్యాబ్‌లో జరిగిన సంభాషణ ఓ మహిళకు ఉద్యోగ జీవితం గురించి ఊహించని పాఠాన్ని నేర్పింది. 25 ఏళ్ల పాటు కార్పొరేట్‌ రంగంలో పనిచేసిన ఓ వ్యక్తి.. ఇప్పుడు క్యాబ్‌ నడుపుతూ జీవనం సాగిస్తున్నాడు. తన ఉద్యోగం పోవడానికి ఆఫీసు రాజకీయాలు, ఓ సహోద్యోగి చేసిన ఆరోపణలే కారణమని ఆయన చెప్పినట్లు అంజలీ సింగ్‌ అనే ఆ మహిళ లింక్డిన్‌ పోస్ట్‌ చేశారు.

ఉద్యోగం పోయిన తర్వాత..
బెంగళూరుకు వెళ్లేందుకు రాంచీ విమానాశ్రయానికి బయల్దేరిన సమయంలో అంజలీ ఆ క్యాబ్‌లో ప్రయాణించారు. ఆ సందర్భంగా డ్రైవర్‌ తన గతాన్ని ఆమెతో పంచుకున్నారు. 25 ఏళ్ల కార్పొరేట్‌ కెరీర్‌ తర్వాత అనూహ్యంగా ఉద్యోగం కోల్పోయానని చెప్పారు. ఈ వ్యవహారంపై రెండేళ్లుగా కోర్టులో పోరాడుతున్నట్లు వివరించారు.

కేసు తేలే వరకు కుటుంబాన్ని పోషించేందుకు క్యాబ్‌ నడుపుతున్నట్లు తెలిపారు. గతంలో సంపాదించిన దానితో పోలిస్తే ఇప్పుడు తన ఆదాయం దాదాపు నాలుగో వంతుకు పడిపోయిందని చెప్పారు.

ఉద్యోగమే జీవితం కాదని..
ఈ ఘటన తనను ఆలోచింపజేసిందని అంజలీ సింగ్‌ పేర్కొన్నారు. వ్యక్తి ఎన్నో ఏళ్లుగా నిర్మించుకున్న కెరీర్‌ కొన్నిసార్లు ఊహించని పరిణామాలతో కొన్ని రోజుల్లోనే దెబ్బతినొచ్చని తెలిపారు. అయితే క్యాబ్‌ డ్రైవర్‌ చెప్పిన ఆరోపణలు ఆయన వాదన మాత్రమేనని స్పష్టం చేశారు.

ఉద్యోగంపైనే పూర్తిగా ఆధారపడకుండా ఆర్థికంగా సిద్ధంగా ఉండాలని ఆమె సూచించారు. అవసరం రాకముందే పొదుపు చేసుకోవడం, ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడం, ఆఫీసు బయట కూడా మంచి ప్రొఫెషనల్‌ పరిచయాలు పెంచుకోవడం ముఖ్యమని పేర్కొన్నారు. సహోద్యోగులతో మనం వ్యవహరించే తీరు కూడా వారి జీవితాలపై ప్రభావం చూపుతుందని గుర్తుచేశారు.