ఇటలీ పర్యటనలో ఉన్న కొందరు భారతీయ మహిళలు తమ దేశంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఒక రెస్టారెంట్ వెయిటర్‌ను ధైర్యంగా నిలదీశారు. స్థానిక పోలీసులను పిలిపించి, అతడితో బహిరంగంగా క్షమాపణ చెప్పించారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. భారతీయ మహిళల తెగువను నెటిజన్లు వేనోళ్ల ప్రశంసిస్తున్నారు.

జూన్ 23న ఇటలీలోని పీసా నగరంలో ఉన్న 'అంటికా ట్రాటోరియా ఆంటోనిట్టా' అనే రెస్టారెంట్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్ ఖుషీ దూబేతో పాటు మరికొందరు భారతీయ మహిళలు అక్కడ లంచ్ కోసం వెళ్లారు. బిల్లు చెల్లింపు సమయంలో బంగ్లాదేశ్‌కు చెందిన వెయిటర్ హుస్సేన్‌తో వారికి వాగ్వాదం జరిగింది. ఈ క్రమంలో అతడు భారత్‌ను ఉద్దేశించి తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు.

దీనిని తీవ్రంగా పరిగణించిన ఆ మహిళలు, "మర్యాదగా మాట్లాడు, మేం మహిళలం... ఆడవాళ్లను ఎలా గౌరవించాలో నేర్చుకో... మ దేశాన్ని దూషించినందుకు క్షమాపణ చెబుతావా లేదా?" అంటూ అతడిని గట్టిగా ప్రశ్నించారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో వారు పోలీసులకు సమాచారం అందించారు. అక్కడికి చేరుకున్న పోలీసులు ఇరువర్గాల వాదనలు విన్నారు. మహిళల పట్టుబట్టడంతో పోలీసుల సమక్షంలోనే వెయిటర్ తన తప్పును అంగీకరించి, భారత్‌ను దూషించినందుకు బేషరతుగా క్షమాపణ చెప్పాడు.

ఈ మొత్తం ఘటనకు సంబంధించిన వీడియోను ఖుషీ దూబే తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. పరాయి దేశంలో తమ దేశ గౌరవం కోసం నిలబడిన మహిళల ధైర్యాన్ని నెటిజన్లు కొనియాడుతున్నారు.