తాను చదువుకున్న పాఠశాలకు నటుడు ధనుష్ విలువైన కానుక అందించాడు. చెన్నైలోని సాలిగ్రామంలో ఉన్న తాయ్ సత్య మెట్రిక్యులేషన్ పాఠశాలకు మూడు అంతస్తుల కొత్త భవనాన్ని నిర్మించి విరాళంగా ఇచ్చాడు. ఈ కొత్త భవనానికి ‘ధనుష్ బ్లాక్’ అని పేరు పెట్టడం విశేషం.

ధనుష్ పదో తరగతి వరకు ఇదే పాఠశాలలో చదివాడు. ఇటీవల కొత్త భవనం ప్రారంభోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ధనుష్ తన స్కూల్ సహచరుడు, సినిమాటోగ్రాఫర్ కుమరన్‌తో కలిసి హాజరయ్యాడు. ఇద్దరూ 1999 బ్యాచ్‌కు చెందిన విద్యార్థులు.

ఈ సందర్భంగా ధనుష్ తన ఉపాధ్యాయులందరి పాదాలకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నాడు. వారితో కలిసి ఫొటోలు దిగాడు. ఈ దృశ్యాలు అక్కడున్న వారిని భావోద్వేగానికి గురిచేశాయి.

ధనుష్‌తో ఎల్‌కేజీ నుంచి పదో తరగతి వరకు కలిసి చదివిన కుమరన్, ఆయన భార్య లక్ష్మీ కృప కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం కుమరన్ మాట్లాడుతూ.. పదో తరగతి వరకు తాము ముగ్గురూ ఇదే పాఠశాలలో చదివామని చెప్పాడు. ఆ తర్వాత ధనుష్‌తో కలిసి మరో పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశానన్నాడు. ధనుష్ సినీ రంగంలోకి వెళ్లగా, తాను ఇంజినీరింగ్ పూర్తి చేసి తర్వాత సినిమాటోగ్రాఫర్‌గా మారినట్టు తెలిపాడు. ‘తంగమగన్’ వంటి చిత్రాల్లో ధనుష్‌తో కలిసి పనిచేసిన విషయాన్ని గుర్తు చేశాడు.

పాఠశాల భవనాల పరిస్థితి గురించి తెలుసుకున్న ధనుష్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఈ కొత్త భవనం నిర్మించారని కుమరన్ చెప్పాడు. అంతేకాదు, పాత భవనాలను పునరుద్ధరించడంతో పాటు ఖాళీ స్థలాల్లో మరిన్ని కొత్త భవనాలు కూడా నిర్మిస్తానని ధనుష్ హామీ ఇచ్చాడని వెల్లడించాడు. ఆయన చేసిన సాయం తమను ఎంతో కదిలించిందని అన్నాడు.

ఇటీవల ప్రకటించిన 72వ జాతీయ చలనచిత్ర పురస్కారాల్లో ధనుష్‌ నటుడిగా ఒకటి, దర్శకుడిగా మరోటి ఇలా రెండు జాతీయ అవార్డులు అందుకున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామి తెరకెక్కిస్తున్న ‘ఓం’ చిత్రంలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో మలయాళ సూపర్ స్టార్ మమ్ముట్టి కూడా కీలక పాత్ర పోషిస్తున్నాడు.