ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తన అభిమానులకు ఊహించని బహుమతి ఇచ్చి వారి మనసులు గెలుచుకున్నారు. తన ఫ్యాన్స్ అసోసియేషన్ సభ్యులందరికీ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ చేయించి అండగా నిలిచారు. ప్రస్తుతం ఆయన 'రాకా' సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ హోటల్‌లో నిన్న అల్లు అర్జున్ ఫ్యాన్స్ అసోసియేషన్ మీట్ జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన ఆయన, అభిమానులతో సరదాగా ముచ్చటించి, ఫొటోలు దిగారు. ఇదే వేదికగా తన అభిమానుల సంక్షేమం కోసం ఓ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌లోని రాష్ట్ర స్థాయి సభ్యులకు రూ. 5 లక్షలు, జిల్లా స్థాయి సభ్యులకు రూ. 3 లక్షల చొప్పున ప్రమాద బీమా చేయించినట్లు తెలిపారు. ఇందుకు సంబంధించిన ఇన్సూరెన్స్ కార్డులను సభ్యులకు అందజేశారు. ఈ కార్డుల ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుమారు వెయ్యి మంది అభిమానులు హాజరైన ఈ మీట్‌లో అల్లు అర్జున్ ట్రోల్స్‌పై చేసిన వ్యాఖ్యలు కూడా చర్చనీయాంశమయ్యాయి. గత కొంతకాలంగా తన అభిమాన సంఘాలను ఒక పద్ధతి ప్రకారం ఆర్గనైజ్ చేస్తూ, వారికి మార్గనిర్దేశం చేస్తూ తన ఇమేజ్‌ను మరింత పటిష్ఠం చేసుకుంటున్నారని విశ్లేషకులు అంటున్నారు. అభిమానుల పట్ల ఆయన చూపిన ఈ బాధ్యత అందరి ప్రశంసలు అందుకుంటోంది.