తెలుగుదేశం పార్టీలో క్రమశిక్షణే అత్యంత ముఖ్యమని, పార్టీ విధానాలు, అధినేత ఆదేశాల కంటే ఎవరూ గొప్పవారు కాదని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. ఇటీవల తాటిపాకలో జరిగిన ముద్రగడ పద్మనాభం సంస్మరణ సభ వివాదంపై ఎమ్మెల్యే బొండా ఉమా ఇచ్చిన వివరణపై ఆయన స్పందిస్తూ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

పార్టీ గీత దాటితే ఎంతటివారైనా సరే చూస్తూ ఊరుకునేది లేదని, కఠిన చర్యలు తీసుకునేందుకు సైతం వెనకాడమని పల్లా హెచ్చరించారు. "ముఖ్యమంత్రి, పార్టీ అధినేత చంద్రబాబు నిర్ణయాలే అందరికీ శిరోధార్యం. ఇతర రాజకీయ ప్రత్యర్థులు, విపక్ష నేతలతో వేదికలు పంచుకోవద్దని సీఎం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. తప్పనిసరి పరిస్థితుల్లో హాజరైనా సదరు కార్యక్రమానికే పరిమితం కావాలి తప్ప, పార్టీ ప్రతిష్ఠకు భంగం కలిగించేలా ఎవరూ మాట్లాడకూడదు" అని తేల్చిచెప్పారు.

 

ఇక ఈ వివాదంలో బొండా ఉమా ఇచ్చిన వివరణ సంతృప్తికరంగా ఉందని పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. అధినేత చంద్రబాబు మాట జవదాటనని, పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి ఉంటానని బొండా స్పష్టం చేశారని... దాంతో ఈ వివాదం ముగిసిన అధ్యాయమని పల్లా స్పష్టం చేశారు.