అమెరికాలో యాపిల్‌ వినియోగదారులకు సంస్థ కొత్త సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇకపై ఐఫోన్‌, ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ వంటి పరికరాలను ఒకేసారి కొనుగోలు చేయాల్సిన అవసరం లేకుండా నెలవారీ లీజు పద్ధతిలో వినియోగించుకోవచ్చు. ఇటీవల మెమరీ చిప్‌ల ధరలు పెరగడం, కృత్రిమ మేధ (ఏఐ) టెక్నాలజీ ప్రభావంతో పలు ఉత్పత్తుల ధరలను యాపిల్‌ 100 నుంచి 500 డాలర్ల వరకు పెంచిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. వినియోగదారులపై ఒకేసారి పడే ఆర్థిక భారం తగ్గించడమే ఈ కొత్త పథకం లక్ష్యంగా కనిపిస్తోంది.

‘అప్‌గ్రేడ్‌’ పేరుతో తీసుకొచ్చిన ఈ లీజు పథకాన్ని ‘బై నౌ.. పే లేటర్‌’ సేవలు అందించే క్లార్నాతో కలిసి యాపిల్‌ అమలు చేస్తోంది. వినియోగదారులు ఆన్‌లైన్‌లో లేదా యాపిల్‌ స్టోర్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే ఇందుకు సాఫ్ట్‌ క్రెడిట్‌ చెక్‌ తప్పనిసరి. ఐఫోన్‌లు, యాపిల్‌ వాచ్‌లను 12 లేదా 24 నెలల కాలానికి లీజుకు తీసుకోవచ్చు. మ్యాక్‌లు, ఐప్యాడ్‌లకు 24 లేదా 36 నెలల కాలపరిమితి ఉంటుంది. ఈ పథకంలో అత్యంత తక్కువ ధర ఐఫోన్‌కు నెలకు 17.99 డాలర్లు చెల్లిస్తే సరిపోతుంది.

లీజు గడువు పూర్తయ్యాక వినియోగదారులకు పలు ఎంపికలు ఉంటాయి. మిగిలిన మొత్తాన్ని చెల్లించి అదే డివైజ్‌ను శాశ్వతంగా సొంతం చేసుకోవచ్చు. లేదా తిరిగి ఇచ్చేసి పథకం నుంచి వైదొలగవచ్చు. కొత్త మోడల్‌కు మారాలనుకుంటే మరో లీజు ఒప్పందం చేసుకునే అవకాశం కూడా ఉంటుంది. పరికరాన్ని కొనుగోలు చేసే సందర్భంలో మిగిలిన మొత్తాన్ని మాత్రమే చెల్లించాల్సి ఉంటుంది. అయితే మొత్తం ఖర్చు ఆ ఉత్పత్తి అసలు ధరను మించదని సంస్థ తెలిపింది.

ఈ పథకంలో ఐఫోన్‌ 17 సిరీస్‌, ఐఫోన్‌ ఎయిర్‌, యాపిల్‌ వాచ్‌ సిరీస్‌ 11, యాపిల్‌ వాచ్‌ అల్ట్రా 3, మ్యాక్‌బుక్‌ ఎయిర్‌, మ్యాక్‌బుక్‌ ప్రో, ఐమ్యాక్‌, మ్యాక్‌ స్టూడియో, ఐప్యాడ్‌ ఎయిర్‌, ఐప్యాడ్‌ ప్రో, ఐప్యాడ్‌ మినీ వంటి ఉత్పత్తులు ఉన్నాయి. అయితే ఐఫోన్‌ 16, బేసిక్‌ ఐప్యాడ్‌, మ్యాక్‌బుక్‌ నియో, యాపిల్‌ వాచ్‌ ఎస్‌ఈ వంటి తక్కువ ధర మోడళ్లను ఇందులో చేర్చలేదు. ఇప్పటి వరకు అమలులో ఉన్న ఐఫోన్‌ అప్‌గ్రేడ్‌ ప్రోగ్రామ్‌కు బదులుగా ఈ కొత్త పథకాన్ని తీసుకొచ్చింది. సెప్టెంబర్‌లో కొత్త ఐఫోన్‌లతో పాటు యాపిల్‌ తొలి ఫోల్డబుల్‌ ఐఫోన్‌ను కూడా విడుదల చేసే అవకాశం ఉందన్న అంచనాల మధ్య ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.