లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కుటుంబంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక బీజేపీ ఎమ్మెల్యే యశ్‌పాల్‌ సువర్ణపై పోలీసులు కేసు నమోదు చేశారు. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన ఘటనను ప్రస్తావిస్తూ, కాంగ్రెస్‌ ఇదే తరహా రాజకీయాలు కొనసాగిస్తే రాహుల్‌ గాంధీ కుటుంబానికీ అదే పరిస్థితి వస్తుందని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపాయి. సామాజిక మాధ్యమాల్లో ప్రసంగం వీడియో వైరల్‌ కావడంతో కాంగ్రెస్‌ తీవ్రంగా స్పందించింది.

ఉడుపిలో నిర్వహించిన బీజేపీ కార్యక్రమంలో యశ్‌పాల్‌ సువర్ణ ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై ఉడుపి జిల్లా కాంగ్రెస్‌ కమిటీ అధ్యక్షుడు అశోక్‌ కుమార్‌ కొడవూర్‌ ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. భారతీయ న్యాయ సంహితలోని పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. విద్వేషాన్ని రెచ్చగొట్టేలా, బెదిరింపులకు పాల్పడేలా ఎమ్మెల్యే మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఈ ఘటనపై కర్ణాటక కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, ఎమ్మెల్సీ మంజునాథ్‌ భండారి తీవ్రంగా స్పందించారు. రాజ్యాంగాన్ని పరిరక్షిస్తానని ప్రమాణం చేసిన ప్రజాప్రతినిధి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. నీట్‌ ప్రశ్నపత్రం లీక్‌ వివాదం, దేశవ్యాప్త నిరసనల నుంచి ప్రజల దృష్టి మళ్లించేందుకే రాహుల్‌ గాంధీపై బీజేపీ వ్యక్తిగత విమర్శలకు దిగుతోందని ఆరోపించారు. కార్యక్రమంలో ఉన్న ఇతర బీజేపీ ప్రజాప్రతినిధులు కూడా ఈ వ్యాఖ్యలను ఖండించకపోవడం ఆందోళనకరమని అన్నారు.