వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేశ్ కుటుంబంలో రేగిన గృహహింస, వరకట్న వేధింపుల వివాదం తీవ్ర రూపం దాల్చింది. తమను పోలీసులు అరెస్ట్ చేయకుండా రక్షణ కల్పించాలని, ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని కోరుతూ జోగి రమేశ్ కుటుంబ సభ్యులు విజయవాడలోని మహిళా కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్లను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం... కేసు వివరాలపై పూర్తిస్థాయి కౌంటర్ దాఖలు చేయాల్సిందిగా ఇబ్రహీంపట్నం పోలీసులను ఆదేశించింది.
జోగి రమేశ్ పెద్ద కోడలు మేఘన ఇచ్చిన ఫిర్యాదుతో ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో హత్యాయత్నం, గృహహింసతో పాటు వరకట్న నిరోధక చట్టం కింద తీవ్రమైన సెక్షన్లతో కేసు నమోదైంది. ఈ కేసు ఎఫ్ఐఆర్లో జోగి రమేశ్ తో పాటు ఆయన సోదరుడు రాము, సోదరి రమతో కలిపి మొత్తం 11 మంది కుటుంబ సభ్యుల పేర్లను నిందితులుగా పోలీసులు చేర్చారు.
కోడలి ఫిర్యాదు ఆధారంగా జోగి రాజీవ్, రమేశ్, శకుంతల, రోహిత్, ప్రియాంక, జోగి రాము, అతని కుమారులు రాకేశ్, పాండుతో పాటు స్వామి, రమ, సాయిలపై కేసులు నమోదు చేయడంతో వారంతా ఇప్పుడు చట్టపరమైన రక్షణ కోసం ముందస్తు బెయిల్ పిటిషన్లు దాఖలు చేసుకున్నారు.
