సంస్థ లాభాల బాట పట్టే వరకు తాను వేతనం తీసుకోబోనని శపథం చేసిన ఒక వ్యవస్థాపకుడికి స్టాక్ మార్కెట్ ఊహించని సంపదను తెచ్చిపెట్టింది. చైనాకు చెందిన మెమరీ చిప్ తయారీ దిగ్గజం 'చాంగ్జిన్ మెమరీ టెక్నాలజీస్' (సీఎక్స్ఎంటీ) వ్యవస్థాపకుడు జూ యిమింగ్, కంపెనీ రికార్డు స్థాయి ఐపీఓతో ఒక్కరోజులోనే బిలియనీర్గా అవతరించారు. దీంతో ఆయన సంపద విలువ సుమారు 15.9 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 1.32 లక్షల కోట్లు) చేరుకుంది. మరోవైపు, టెక్ దిగ్గజం యాపిల్ తన ఉత్పత్తుల కోసం సీఎక్స్ఎంటీ చిప్ల వినియోగాన్ని పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.
సెమీకండక్టర్ల రంగంలో స్వయం సమృద్ధి సాధించాలన్న చైనా లక్ష్యాల్లో భాగంగా 2016లో సీఎక్స్ఎంటీ ప్రారంభమైంది. శాంసంగ్, మైక్రాన్ వంటి అంతర్జాతీయ దిగ్గజాలకు పోటీగా స్వదేశీ సాంకేతికతతో డీ-ర్యామ్ చిప్లను తయారు చేయడమే లక్ష్యంగా జూ యిమింగ్ ఈ సంస్థను స్థాపించారు. కంపెనీ నష్టాల్లో ఉన్నకాలంలో జీతభత్యాలు, బోనస్లు తీసుకోకుండా పనిచేసిన ఆయన, ఇప్పుడు ఐపీఓ విజయంతో ప్రపంచ కుబేరుల జాబితాలో చేరారు.
జూ యిమింగ్ గత ఎనిమిదేళ్లుగా ఎటువంటి వేతనం తీసుకోలేదు. సీఎక్స్ఎంటీని స్థాపించడానికి ముందే ఆయన ఒక విజయవంతమైన వ్యాపారవేత్తగా గుర్తింపు పొందారు. చైనాలోని ప్రతిష్ఠటాత్మక చింగ్వా విశ్వవిద్యాలయంలో భౌతికశాస్త్రాన్ని అభ్యసించిన ఆయన, అనంతరం అమెరికాలో ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్లో ఉన్నత విద్యను పూర్తి చేశారు. సిలికాన్ వ్యాలీలో తన వృత్తి జీవితాన్ని ప్రారంభించిన ఆయన, ఆ తర్వాత స్వదేశానికి తిరిగి వచ్చి 2005లో గిగా డివైస్ అనే ఫ్లాష్ మెమొరీ చిప్ తయారీ సంస్థను ఏర్పాటు చేశారు. దానిని విజయవంతంగా నడిపిన అనంతరం, సెమీకండక్టర్ల రంగంలోకి అడుగుపెట్టారు.
సోమవారం షాంఘై స్టాక్ ఎక్స్ఛేంజ్లో లిస్ట్ అయిన సీఎక్స్ఎంటీ షేర్లు, ట్రేడింగ్ ప్రారంభమైన తొలిరోజే సుమారు 500 శాతం వృద్ధిని నమోదు చేశాయి. దీంతో కంపెనీ మార్కెట్ విలువ 487 బిలియన్ డాలర్లకు (సుమారు రూ. 46 లక్షల కోట్లు) చేరింది. ఈ ఐపీఓ ద్వారా సంస్థ 8.5 బిలియన్ డాలర్ల నిధులను సమీకరించింది. స్మార్ట్ఫోన్లు, కంప్యూటర్లు, ఏఐ డేటా సెంటర్లలో ఉపయోగించే డీ-ర్యామ్ చిప్లను సీఎక్స్ఎంటీ ఉత్పత్తి చేస్తోంది. చైనా మార్కెట్ కోసం సిద్ధం చేసే ఉత్పత్తుల్లో వాడేందుకు యాపిల్ సంస్థ సీఎక్స్ఎంటీ చిప్లను పరిశీలిస్తున్నట్లు సమాచారం.
చైనా చిప్ కంపెనీ సీఎక్స్ఎంటీ ఐపీఓలో అద్భుతం..
