విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం హౌస్ నెం. 47' (ఏకే 47). తాజాగా ఈ చిత్రం నుంచి మరో ఆసక్తికరమైన అప్డేట్ వచ్చింది. చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమాలోని మరో ముఖ్య పాత్రను పరిచయం చేస్తూ ఒక చిన్న వీడియో గ్లింప్స్ను విడుదల చేసింది. ఇందులో వెంకటేష్ కూతురు 'సంపూర్ణ" పాత్రలో నటి యువినా పార్థవిని ప్రేక్షకులకు పరిచయం చేశారు.
ఈ కొత్త గ్లింప్స్లో, చిట్టిబాబు పాత్రలో ఉన్న వెంకటేశ్, రఘుబాబుతో ఇంటి విషయాల గురించి మాట్లాడుతుండగా, వారి కూతురు సంపూర్ణ (యువినా పార్థవి) ఎంతో ఉత్సాహంగా పరిగెత్తుకుంటూ వస్తుంది. "నాన్నా.. నేను ప్రేమలో పడ్డాను" అని తండ్రితో చెబుతుంది. దానికి చిట్టిబాబు చిరాకు పడుతూ, "ఈసారి కార్ డ్రైవర్తోనా, మెకానిక్తోనా?" అని అడగటంతో ఈ వీడియోలో చూడొచ్చు. తండ్రీకూతుళ్ల మధ్య సాగే ఈ ఫన్నీ సంభాషణ, సినిమా ఫ్యామిలీ కామెడీ ఎంటర్టైనర్గా ఉండబోతోందన్న సంకేతాలను ఇస్తోంది. ఈ గ్లింప్స్కు సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది.
చిత్రబృందం వినూత్నంగా ప్రమోషన్లు నిర్వహిస్తోంది. ఇప్పటికే వెంకటేశ్ ను చిట్టిబాబుగా, ఆయన భార్య స్వర్ణ పాత్రలో శ్రీనిధి శెట్టిని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు కూతురి పాత్రను కూడా పరిచయం చేయడంతో సినిమాపై అంచనాలు మరింత పెరుగుతున్నాయి. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై ఎస్. రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
ఈ సినిమాలో వెంకటేశ్, శ్రీనిధి శెట్టి, యువినా పార్థవితో పాటు నివేదా పేతురాజ్, రాజ్ ప్రజ్వల్, రావు రమేశ్, సత్య, బ్రహ్మాజీ, వెన్నెల కిశోర్ వంటి భారీ తారాగణం నటిస్తోంది. తమన్ సంగీతం అందిస్తుండగా, రవి కె. చంద్రన్ సినిమాటోగ్రాఫర్గా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. ఈ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ను 2026 అక్టోబర్ 2న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.
వెంకటేష్, త్రివిక్రమ్ కాంబోలో వస్తున్న చిత్రం 'ఆదర్శ కుటుంబం' ..
