భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి (52) కన్నుమూశారు. గత ఐదు రోజులుగా గుండెపోటుతో సికింద్రాబాద్లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన, గురువారం అర్ధరాత్రి 12.50 గంటలకు తుదిశ్వాస విడిచినట్లు వైద్యులు అధికారికంగా ప్రకటించారు. ఆయన మరణవార్తతో బీఆర్ఎస్ శ్రేణుల్లో, నర్సంపేట నియోజకవర్గంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
ఈ నెల 26న హనుమకొండలోని తన నివాసంలో ఉన్న సుదర్శన్రెడ్డికి ఛాతీలో తీవ్రమైన నొప్పి రావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన కార్డియాక్ అరెస్ట్కు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సుమారు గంట పాటు శ్రమించి, తొమ్మిది సార్లు సీపీఆర్ చేసిన తర్వాత ఆయన గుండె తిరిగి స్పందించింది. దీంతో మెరుగైన చికిత్స కోసం వెంటనే సికింద్రాబాద్ యశోద ఆసుపత్రికి తరలించారు.
అక్కడ ప్రత్యేక వైద్య బృందం ఆయనను వెంటిలేటర్పై ఉంచి చికిత్స ప్రారంభించింది. అయితే, సుదీర్ఘకాలం స్పృహలోకి రాకపోవడంతో నాడీ సంబంధిత స్పందన కనిపించలేదు. ఆక్సిజన్ సరఫరాలో అంతరాయం కారణంగా మెదడుకు తీవ్ర నష్టం వాటిల్లినట్లు ఈసీజీ, బ్రెయిన్ ఎంఆర్ఐ పరీక్షల్లో తేలిందని వైద్యులు తెలిపారు. ఐదు రోజులుగా మృత్యువుతో పోరాడిన ఆయన చివరకు కన్నుమూశారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో 1974 ఆగస్టు 6న ఒక సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన సుదర్శన్రెడ్డి, రాజకీయాల్లో అంచెలంచెలుగా ఎదిగారు. తెలంగాణ ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. తొలుత కాంగ్రెస్లో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన ఆయన, 2001లో టీఆర్ఎస్ (ప్రస్తుత బీఆర్ఎస్)లో చేరారు. అదే ఏడాది నల్లబెల్లి జడ్పీటీసీగా గెలుపొందారు. 2015లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ ఛైర్మన్గా బాధ్యతలు నిర్వర్తించారు. అనంతరం 2018 శాసనసభ ఎన్నికల్లో నర్సంపేట నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించి అసెంబ్లీలో అడుగుపెట్టారు.
బీఆర్ఎస్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి మృతి..
