ప్రజల తరఫున మేం చేసే పోరాటాలను ఇటువంటి తప్పుడు కేసులు ఎంతమాత్రం ఆపలేవు.. అంతిమంగా సత్యమే గెలుస్తుంది" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ఫార్ములా-ఈ రేసు వ్యవహారానికి సంబంధించిన కేసు విచారణలో భాగంగా నాంపల్లి కోర్టుకు హాజరైన సందర్భంగా ఆయన కాంగ్రెస్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
ఉదయం కోకాపేటలోని తన నివాసం నుంచి నేరుగా నాంపల్లి కోర్టుకు కేటీఆర్ చేరుకున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం తనపై కుట్రపూరితంగా అక్రమ కేసు బనాయించిందని ఆయన మండిపడ్డారు. మరోవైపు, తదుపరి విచారణకు కోర్టు ఆగస్టు 25కి వాయిదా వేసింది. కోర్టు ప్రక్రియ ముగిసిన అనంతరం, అకాల మరణం చెందిన పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి అంత్యక్రియల్లో పాల్గొనేందుకు ఆయన నర్సంపేటకు బయలుదేరారు.
కేసు నేపథ్యం:
యూకేకు చెందిన ‘ఫార్ములా-ఈ ఆర్గనైజేషన్’కు నిబంధనలకు విరుద్ధంగా రూ. 55 కోట్లు మళ్లించారనే అభియోగంపై ఏసీబీ ఈ కేసు నమోదు చేసింది. సుదీర్ఘ దర్యాప్తు అనంతరం ఏసీబీ దాఖలు చేసిన ఛార్జ్షీట్ను కోర్టు పరిగణనలోకి తీసుకోవడంతో, నిందితులుగా ఉన్న కేటీఆర్తో పాటు మాజీ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్, హెచ్ఎండీఏ మాజీ అధికారి బీఎల్ఎన్ రెడ్డి తదితరులు న్యాయస్థానానికి హాజరయ్యారు.
