కావేరి వివాదం నేపథ్యంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌ బెంగళూరు పర్యటనను వాయిదా వేసుకోవాలని కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ సూచించారు. ఆగస్టు 3న మంత్రులతో కలిసి బెంగళూరుకు వస్తానని విజయ్‌ తెలిపారని, ప్రస్తుత పరిస్థితుల్లో పర్యటన సరైనది కాదని తాను వివరించినట్లు చెప్పారు.

విధానసౌధలో ఉప ముఖ్యమంత్రి జి.పరమేశ్వర, జలవనరుల శాఖ మంత్రి రామలింగారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడిన శివకుమార్‌.. అతిథులు వచ్చినప్పుడు ఆహ్వానించడం తమ బాధ్యతని అన్నారు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ఎవరైనా నిరసనలు చేపట్టినా, నినాదాలు చేసినా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడతాయని పేర్కొన్నారు. అందుకే కొంతకాలం ఓపిక పట్టాలని విజయ్‌ను కోరినట్లు వెల్లడించారు.

ఆదివారం జరగనున్న అఖిలపక్ష సమావేశం తర్వాత తదుపరి కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని శివకుమార్‌ తెలిపారు. ప్రస్తుతం కర్ణాటకలో వర్షాలు కురుస్తుండటంతో జలాశయాల్లోకి నీటి ప్రవాహం పెరుగుతోందని, దీంతో చర్చలకు అనుకూల వాతావరణం ఏర్పడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రెండు రాష్ట్రాల ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని కొత్త తేదీ ఖరారు చేస్తామని చెప్పారు.

మేకెదాటు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ ప్రాజెక్టు కర్ణాటకతో పాటు తమిళనాడుకూ ప్రయోజనం చేకూరుస్తుందని శివకుమార్‌ అన్నారు. ఈ ప్రాజెక్టు తాగునీరు, విద్యుత్‌ ఉత్పత్తి కోసమేనని, సాగునీటి అవసరాలకు కాదని స్పష్టం చేశారు. కావేరి జలాల పంపిణీపై సుప్రీంకోర్టు తీర్పును గౌరవిస్తామని, అయితే వర్షాభావం, నీటి లభ్యత వంటి ప్రస్తుత పరిస్థితులను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పేర్కొన్నారు.