జమ్ముకశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రి, పీడీపీ అధినేత్రి మెహబూబా ముఫ్తీ జాతీయ జెండాను తలకిందులుగా పట్టుకున్న ఘటన రాజకీయంగా తీవ్ర వివాదానికి దారితీసింది. శ్రీనగర్‌లో ఆర్టికల్‌ 370, 35ఏ రద్దు వార్షిక దినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన నిరసనలో ఆమె చేతిలో త్రివర్ణ పతాకం తలకిందులుగా కనిపించింది. దీనిపై బీజేపీ తీవ్ర విమర్శలు గుప్పించింది.

నిరసన కార్యక్రమంలో మెహబూబా ముఫ్తీ జాతీయ జెండాతో పాటు జమ్ముకశ్మీర్‌ పాత రాష్ట్ర జెండాను కూడా చేతిలో పట్టుకున్నారు. అయితే జాతీయ జెండాలో పైభాగంలో ఉండాల్సిన కాషాయ రంగు కిందకు రావడం కనిపించింది. భారత జెండా నియమావళి ప్రకారం జాతీయ పతాకాన్ని నిర్ణీత విధానంలోనే ప్రదర్శించాలి. తలకిందులుగా ప్రదర్శించడం నిబంధనలకు విరుద్ధంగా పరిగణిస్తారు.

ఈ ఘటనపై కేంద్ర మంత్రి గిరిరాజ్‌ సింగ్‌ తీవ్రంగా స్పందించారు. మెహబూబా ముఫ్తీ ఉగ్రవాదులకు మద్దతుగా వ్యవహరించారని ఆరోపిస్తూ తీవ్ర విమర్శలు చేశారు. ఆర్టికల్‌ 370 రద్దుతో దేశంలో ‘‘ఒకే దేశం, ఒకే జెండా, ఒకే రాజ్యాంగం’’ అమల్లోకి వచ్చిందని వ్యాఖ్యానించారు. బీజేపీ ఎంపీ సత్‌పాల్‌ శర్మ కూడా ఆమె జాతీయ జెండాను అవమానించారని ఆరోపిస్తూ చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

మరోవైపు కేంద్ర మంత్రి రాందాస్‌ అథవాలే మాత్రం ఘటనను ముందుగా పరిశీలించాలని అభిప్రాయపడ్డారు. ఉద్దేశపూర్వకంగా చేశారా, పొరపాటున జరిగిందా అనేది నిర్ధారించాల్సి ఉందన్నారు. జాతీయ జెండాను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీ స్పందిస్తూ, గతంలో పీడీపీతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేసిన బీజేపీ ఇప్పుడు విమర్శించడం ఎందుకని ప్రశ్నించారు.