రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రౌడీషీటర్ గాదె సాయికృష్ణ కస్టడీ మరణం, మృతదేహం అదృశ్యం కేసులో ప్రత్యేక విచారణ బృందం (సిట్) దర్యాప్తును వేగవంతం చేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నానిలను కస్టడీలోకి తీసుకుని, "శవాన్ని ఏం చేశారు?" అనే ప్రధాన ప్రశ్నతో ఉక్కిరిబిక్కిరి చేసింది.

విజయవాడ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఐజీ రవిప్రకాష్ పర్యవేక్షణలో సిట్ బృందం వీరిద్దరినీ వేర్వేరుగా విచారించింది. సాయికృష్ణను కోర్టులో ఎందుకు హాజరుపరచలేదని, స్టేషన్‌లోనే మరణించాడా? అని ప్రశ్నించగా, స్టేషన్‌కు తీసుకురావడం వరకే తమకు తెలుసని వారు బదులిచ్చారు. గంజాయి సరఫరాదారుల కోసం గుణదలకు వెళ్లినప్పటి టవర్ లొకేషన్ ఆధారాలను చూపించగా, ఒక నిందితుడు తనకు గుర్తులేదంటూ సమాధానాన్ని దాటవేశాడు. లాకప్‌లో గాయపడిన సాయికృష్ణకు చికిత్స అందించేందుకు ఆర్‌ఎంపీ డాక్టర్‌ను ఎవరు పిలిచారని అడగ్గా, ఇద్దరూ మౌనం వహించారు.

మరోవైపు, ఇదే కేసులో రిమాండ్‌లో ఉన్న నిందితులు బాబూరావు, సాంబయ్యలను కూడా సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. వైద్య పరీక్షల అనంతరం వారిని కోర్టులో హాజరుపరచగా, చెప్పాల్సింది ఏమీ లేదని వారు తెలిపారు. కాగా, హెడ్ కానిస్టేబుళ్లు అశోక్, నాని దాఖలు చేసిన బెయిల్ పిటిషన్లను కోర్టు సాంకేతిక కారణాలతో తిరస్కరించింది.

ప్రస్తుతం ఈ కేసులో కీలక సూత్రధారులు ఎవరనే దానిపై సిట్ దృష్టి సారించింది. మృతదేహాన్ని ఏం చేశారనేది కనుగొనడంతో పాటు, పరారీలో ఉన్న మరో నిందితుడు సురేష్ ఆచూకీ కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసింది.