మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన 'కొరియన్ కనకరాజు' చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. హారర్-కామెడీ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తున్న నేపథ్యంలో, మెగాస్టార్ చిరంజీవి చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు.

ఈ సినిమా గురించి ఎక్కడ చూసినా 'నవ్వులే నవ్వులు' అనే మాట వినిపిస్తోందని చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. "డియర్ వరుణ్ తేజ్.. నువ్వు ఈ విజయానికి పూర్తిగా అర్హుడివి. నీ శ్రమకు, నిజాయితీకి సరైన ప్రతిఫలం దక్కింది" అని అభినందించారు. దర్శకుడు మేర్లపాక గాంధీ, కమెడియన్ సత్య, హీరోయిన్ రితికా నాయక్, నిర్మాతలకు కూడా ఆయన శుభాకాంక్షలు తెలిపారు.

మేర్లపాక గాంధీ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో వరుణ్ తేజ్ అనంతపురం యువకుడిగా, విలక్షణమైన బాడీ లాంగ్వేజ్‌, రాయలసీమ యాసలో మాట్లాడి అలరించారు. అనంతపురం జిల్లా పెనుగొండ నేపథ్యంలో సాగే ఈ కథలో, కియా కంపెనీలో పనిచేసే అమ్మాయిని ప్రేమించడం, ఆపై కొరియన్ సంస్కృతికి సంబంధించిన పరిణామాలు నవ్వులు పూయిస్తాయి.

తాను త్వరలోనే ఈ చిత్రాన్ని చూస్తానని, ఇది మరింత పెద్ద బ్లాక్‌బస్టర్‌గా నిలవాలని ఆకాంక్షిస్తున్నట్లు చిరంజీవి తన పోస్టులో పేర్కొన్నారు. ప్రస్తుతం మెగాస్టార్ చేసిన ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.