మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్ సిడ్నీలో నిర్వహించాల్సిన లైవ్ షో చివరి నిమిషంలో వాయిదా పడింది. ఆస్ట్రేలియా వీసా సకాలంలో మంజూరు కాకపోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. "వైకిట్టు ఎంధ పరిపాడి" పేరిట ఈ కార్యక్రమాన్ని శనివారం సిడ్నీలోని నార్వెస్ట్ కన్వెన్షన్ సెంటర్‌లో కాయల్ ఈవెంట్స్ సంస్థ నిర్వహించాల్సి ఉంది.

ఈ ప్రదర్శనలో పాల్గొనేందుకు ప్రముఖ గాయని కేఎస్ చిత్ర, నటుడు మనోజ్ కే జయన్ సహా ఇతర కళాకారులు ఇప్పటికే ఆస్ట్రేలియా చేరుకున్నారు. అయితే, వీసా క్లియరెన్స్ కోసం సింగపూర్‌లో వేచి చూస్తున్న మోహన్‌లాల్‌కు అనుమతి లభించకపోవడంతో ఆయన ప్రయాణం రద్దయింది. వీసా దరఖాస్తు తిరస్కరణకు గురికాలేదని, కేవలం ప్రాసెసింగ్‌లో అనుకోని జాప్యం జరిగిందని నిర్వాహకులు స్పష్టం చేశారు. త్వరలోనే కార్యక్రమ తదుపరి తేదీని ప్రకటిస్తామని వెల్లడించారు.

ఈ పరిణామంపై మోహన్‌లాల్ వీడియో సందేశం ద్వారా అభిమానులకు క్షమాపణలు తెలిపారు. "ఇది ఎలా జరిగిందో నాకు తెలియదు. సాంకేతిక కారణమో లేక క్లరికల్ పొరపాటో ఏదైనా కావచ్చు, దీనికి పూర్తి బాధ్యత నేనే వహిస్తున్నాను. నేను రాలేకపోతున్నాందుకు అందరికీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాను" అని ఆయన పేర్కొన్నారు. త్వరలోనే ఇదే బృందంతో మళ్లీ ప్రదర్శన ఇస్తామని ఈ సందర్భంగా ఆయన హామీ ఇచ్చారు.