పెట్రోల్‌లో ఇథనాల్‌ మిశ్రమం కలపకపోయి ఉంటే ఇటీవల పశ్చిమాసియా సంక్షోభం సమయంలో ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర దాదాపు రూ.125కు చేరేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఇథనాల్‌ బ్లెండింగ్‌ వల్ల అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగినా వినియోగదారులపై భారం పడలేదని పేర్కొంది. ఈ విధానం కారణంగా లీటర్‌కు దాదాపు రూ.30 వరకు ఆదా అయ్యిందని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది.

పశ్చిమాసియా ఉద్రిక్తతల సమయంలో భారత క్రూడాయిల్‌ బాస్కెట్‌ ధర బ్యారెల్‌కు 135 డాలర్ల వరకు చేరిందని తెలిపింది. ఆ పరిస్థితిలో ఇథనాల్‌ మిశ్రమం లేకుంటే పెట్రోల్‌ ధర రూ.125కు చేరేదని వివరించింది. అయితే ప్రస్తుతం ప్రతి లీటర్‌లో 20 శాతం దేశీయంగా ఉత్పత్తి చేసిన ఇథనాల్‌ను కలపడం వల్ల ఢిల్లీలో పెట్రోల్‌ ధర రూ.94.77కే పరిమితమైందని పేర్కొంది.

ఇథనాల్‌ బ్లెండింగ్‌తో ముడిచమురు దిగుమతులపై ఆధారపడటం తగ్గుతోందని కేంద్రం వెల్లడించింది. ఇప్పటివరకు ఈ కార్యక్రమం వల్ల రూ.1.97 లక్షల కోట్ల విదేశీ మారక ద్రవ్యం ఆదా అయినట్లు తెలిపింది. అలాగే 950 లక్షల మెట్రిక్‌ టన్నులకుపైగా కార్బన్‌ డైఆక్సైడ్‌ ఉద్గారాలు తగ్గాయని పేర్కొంది. రైతులు, డిస్టిలరీలకు రూ.1.66 లక్షల కోట్లకుపైగా చెల్లింపులు జరిగాయని వెల్లడించింది.

ఆహార భద్రతకు ఎలాంటి ఇబ్బంది లేకుండా మిగులు ధాన్యాన్నే ఇథనాల్‌ తయారీకి వినియోగిస్తున్నామని కేంద్రం స్పష్టం చేసింది. ప్రజా పంపిణీ వ్యవస్థ, జాతీయ ఆహార భద్రత చట్టం, సంక్షేమ పథకాల కోసం అవసరమైన ధాన్యాన్ని మళ్లించడం లేదని తెలిపింది. మానవ వినియోగానికి పనికిరాని ధాన్యం, విరిగిన బియ్యాన్ని కూడా ఈ కార్యక్రమంలో వినియోగిస్తున్నట్లు వివరించింది.