జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో జరిగిన వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొని ‘నేతన్న సేవలో’ పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు అర్హులైన 71,636 చేనేత కుటుంబాలకు రూ.25 వేల చొప్పున మొత్తం రూ. 179 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేస్తున్నట్లు ప్రకటించారు. చీరాల గడ్డపై ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు.
చేనేత కేవలం ఒక వృత్తి మాత్రమే కాదని, భారతీయ సంస్కృతికి, మన దేశం గర్వించే కళకు ప్రతీక అని సీఎం అభివర్ణించారు. చీరాల, ధర్మవరం, వెంకటగిరి, ఉప్పాడ, మంగళగిరి, పొందూరు వంటి ప్రాంతాల చేనేత ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని చెప్పారు. కాలక్రమేణా కష్టాల్లో కూరుకుపోయిన ఈ రంగాన్ని ప్రోత్సహించి, చేనేత కార్మికుల జీవన ప్రమాణాలు పెంచడమే తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు.
