పుస్తకం తీసుకుని సమయానికి తిరిగివ్వకపోతే జరిమానా వేయడం సాధారణమే. కానీ ఏకంగా 150 ఏళ్ల తర్వాత లైబ్రరీకి తిరిగొచ్చిన పుస్తకానికి వేసిన జరిమానా మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆస్ట్రేలియాలోని ఓ పబ్లిక్‌ లైబ్రరీకి చెందిన పుస్తకం దాదాపు శతాబ్దన్నర తర్వాత బయటపడగా.. దానికి లెక్కించిన ఆలస్య రుసుము సుమారు రూ.19 లక్షలకు చేరింది. ఈ అరుదైన ఘటన ఇప్పుడు సోషల్‌ మీడియాలోనూ చర్చనీయాంశమైంది.

1858లో ప్రచురితమైన ‘ఆంటిక్విటీస్ ఆఫ్ ఎథెన్స్’ అనే పుస్తకాన్ని ఆస్ట్రేలియాలోని కియామా పట్టణ పబ్లిక్‌ లైబ్రరీ నుంచి తీసుకెళ్లారు. ఆ లైబ్రరీ 1872లో ప్రారంభమైంది. ఇటీవల ఓ వ్యక్తి తన ఇంటికి మరమ్మతులు చేస్తుండగా.. దాచిన ఈ పుస్తకం కనిపించింది. ఆ తర్వాత అతడు దాన్ని గతవారం లైబ్రరీకి అప్పగించాడు.

లైబ్రరీ మేనేజర్‌ మిచెల్‌ హడ్సన్‌ తెలిపిన వివరాల ప్రకారం.. అప్పటి నిబంధనల ప్రకారం పుస్తకం ఆలస్యమైతే వారానికి మూడు పెన్స్‌ జరిమానా విధించేవారు. అదే నిబంధనను ప్రస్తుత విలువకు అనుగుణంగా లెక్కిస్తే దాదాపు 28 వేల ఆస్ట్రేలియన్‌ డాలర్లు (దాదాపు రూ.18.7 లక్షలు) జరిమానా అవుతుందని తెలిపారు. అయితే ఇది కేవలం సరదాగా చేసిన లెక్క మాత్రమే. ఎవరిపైనా ఆ మొత్తాన్ని వసూలు చేసే అవకాశం లేదని స్పష్టం చేశారు.

పుస్తకాన్ని అసలు ఎవరు తీసుకెళ్లారో తెలుసుకునే వీలులేదని లైబ్రరీ అధికారులు చెప్పారు. ఎందుకంటే 1870ల కాలానికి చెందిన నమోదు పుస్తకం కాలక్రమంలో కనిపించకుండా పోయింది. అందులోనే అప్పటి సభ్యుల వివరాలు నమోదు చేసి ఉండేవారు. దీంతో చివరగా ఈ పుస్తకాన్ని తీసుకున్న వ్యక్తి ఎవరో గుర్తించడం అసాధ్యంగా మారింది.

పుస్తకం తేమకు దెబ్బతిన్నా.. చారిత్రక విలువ మాత్రం అలాగే ఉందని లైబ్రరీ అధికారులు పేర్కొన్నారు. ఇకపై దీన్ని ప్రజలకు ఇవ్వకుండా స్థానిక చరిత్ర విభాగంలో ప్రత్యేక ప్రదర్శనకు ఉంచనున్నట్లు మిచెల్‌ హడ్సన్‌ తెలిపారు.