భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇవాళ ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రారంభమయింది. మరోవైపు, ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవంపై వైసీపీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసింది. భోగాపురం ఎయిర్‌పోర్టు సాకారమవ్వడంపై మాజీ సీఎం జగన్ తరఫున ప్రజలకు వైసీపీ ధన్యవాదాలు తెలిపింది. ఈ ప్రాజెక్టుకు పునాది వేసి, కల నుంచి నిజం దిశగా నడిపించిన నాయకుడు ఎవరో రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలుసని పేర్కొంది. అయితే ప్రస్తుతం అధికారంలో ఉన్న ఎన్డీఏ కూటమి నాయకులు ఎలాంటి పాత్ర లేకుండానే మొత్తం క్రెడిట్ వారి ఖాతాలో వేసుకునేందుకు తాపత్రయపడుతున్నారని తీవ్రంగా ఆరోపించింది.


జగన్ ప్రభుత్వం ఉన్న సమయంలోనే ఎయిర్‌పోర్టు నిర్మాణం కోసం రూ.1,200 కోట్లు ఖర్చు చేసి భూసేకరణ ప్రక్రియను పూర్తి చేశామని తెలిపింది. నిర్వాసిత కుటుంబాలకు పరిహారం చెల్లించడంలో తమ ప్రభుత్వమే ముందడుగు వేసిందని స్పష్టం చేసింది. ప్రాజెక్టుకు అవసరమైన అన్ని రకాల కీలక పర్యావరణ, విమానయాన అనుమతులను జగన్ హయాంలోనే వేగవంతంగా సాధించామని తెలిపింది. ఎయిర్‌పోర్టు అనుసంధానతకు అవసరమైన రహదారులు, ఇతర మౌలిక సదుపాయాల కల్పనకు నాటి జగన్ ప్రభుత్వమే శ్రీకారం చుట్టిందని, అందువల్ల ఈ ప్రాజెక్టు విజయంలో చంద్రబాబు పాత్ర ఏమీ లేదని విమర్శించింది.