ప్రతిష్ఠాత్మక సౌత్‌ ఇండియన్‌ ఇంటర్నేషనల్‌ మూవీ అవార్డ్స్‌ (సైమా)-2026కు సంబంధించిన నామినేషన్ల జాబితా విడుదలైంది. దక్షిణాది చలనచిత్ర పరిశ్రమలో అత్యంత గౌరవప్రదంగా భావించే ఈ అవార్డుల కోసం సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిన్న‌ సైమా కమిటీ ఈ నామినేషన్ల జాబితాను అధికారికంగా ప్రకటించింది. ఈసారి తెలుగు విభాగంలో తేజ సజ్జ కథానాయకుడిగా నటించిన 'మిరాయ్' చిత్రం ఏకంగా 11 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకుని అగ్రస్థానంలో నిలిచింది. 2025 జనవరి నుంచి డిసెంబర్ మధ్య సెన్సార్ పూర్తి చేసుకున్న చిత్రాలను ఈ అవార్డుల కోసం పరిగణనలోకి తీసుకున్నారు.

గతేడాది విడుదలై బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన 'మిరాయ్' చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.140 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసి సంచలనం సృష్టించింది. కార్తిక్ ఘట్టమనేని దర్శకత్వంలో యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా తెరకెక్కిన ఈ సినిమాలో మంచు మనోజ్ ప్రతినాయకుడి పాత్రలో కనిపించి మెప్పించారు. ఇప్పుడు సైమాలో అత్యధిక నామినేషన్లు సాధించి మరోసారి తన సత్తా చాటుకుంది.

'మిరాయ్' తర్వాతి స్థానంలో 'సంక్రాంతికి వస్తున్నాం' చిత్రం 10 కేటగిరీల్లో నామినేషన్లు సాధించి గట్టి పోటీ ఇస్తోంది. 2025 సంక్రాంతికి విడుదలై కుటుంబ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్న ఈ చిత్రం రూ.300 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. విక్టరీ వెంకటేశ్ కీలక పాత్రలో నటించగా, అనిల్ రావిపూడి తనదైన శైలిలో ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా దీన్ని రూపొందించారు. మీనాక్షి చౌదరి, ఐశ్వర్యా రాజేశ్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రలు పోషించారు.

వీటితో పాటు అక్కినేని నాగచైతన్య కెరీర్‌లో మైలురాయిగా నిలిచిన 'తండేల్', మరో చిత్రం 'కోర్ట్' చెరో 9 నామినేషన్లతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. వాస్తవ సంఘటనల ఆధారంగా చందు మొండేటి దర్శకత్వంలో తెరకెక్కిన 'తండేల్' చిత్రంలో నాగచైతన్య సరసన సాయి పల్లవి నటించారు. ఈ చిత్రం నాగచైతన్య కెరీర్‌లో తొలి వంద కోట్ల సినిమాగా రికార్డు సృష్టించింది.

ఈ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం సెప్టెంబర్ 11, 12 తేదీల్లో అట్టహాసంగా జరగనుంది. 2025 సంవత్సరంలో తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విశేష ప్రతిభ కనబరిచిన నటీనటులు, దర్శకులు, సంగీత దర్శకులు, ఇతర సాంకేతిక నిపుణులకు ఈ పురస్కారాలు అందజేయనున్నారు. దీంతో ఏయే చిత్రాలకు, ఏయే నటీనటులకు అవార్డులు వస్తాయనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.