2027లో ఇస్లామాబాద్‌లో జరగనున్న షాంఘై సహకార సంస్థ (ఎస్‌సీఓ) సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానిస్తామని పాకిస్థాన్‌ సంకేతాలు ఇచ్చింది. ఎస్‌సీఓ నిబంధనల ప్రకారం సభ్య దేశాల అధినేతలందరికీ ఆహ్వానాలు పంపడం ఆతిథ్య దేశం బాధ్యత అని పాకిస్థాన్‌ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి తెలిపారు. ఆ ప్రక్రియలో భాగంగానే భారత్‌కూ ఆహ్వానం అందుతుందని స్పష్టం చేశారు.

ఇస్లామాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఈ విషయాన్ని వెల్లడించారు. ఎస్‌సీఓలో సభ్య దేశమైన భారత్‌కు కూడా మిగతా దేశాల మాదిరిగానే అధికారిక ఆహ్వానం పంపుతామని చెప్పారు. ఇది ఎలాంటి ప్రత్యేక నిర్ణయం కాదని, సంస్థ అమలు చేస్తున్న విధానంలో భాగమేనని వివరించారు.

మరోవైపు ఫిలిప్పీన్స్‌లో జరుగుతున్న ఆసియాన్‌ సమావేశాల సందర్భంగా భారత విదేశాంగ మంత్రి ఎస్‌. జైశంకర్‌, పాకిస్థాన్‌ విదేశాంగ మంత్రి మధ్య భేటీ జరగనున్నట్లు వస్తున్న వార్తలపై కూడా స్పందించారు. అలాంటి సమావేశం కోసం భారత్‌ నుంచి ఎలాంటి అభ్యర్థన తమకు అందలేదని పాకిస్థాన్‌ తెలిపింది.

ఎస్‌సీఓలో అధ్యక్ష బాధ్యతల మార్పిడి విధానంలో భాగంగా 2027 సదస్సుకు పాకిస్థాన్‌ ఆతిథ్యం ఇవ్వనుంది. చైనా, రష్యా, భారత్‌, పాకిస్థాన్‌తో పాటు మొత్తం 10 దేశాలు ఈ సంస్థలో సభ్యులుగా ఉన్నాయి. యురేషియా ప్రాంతంలో శాంతి, భద్రత, ఆర్థిక సహకారాన్ని పెంపొందించడమే ఈ సంస్థ ప్రధాన లక్ష్యం.