దేశవ్యాప్తంగా కోట్లాది ఉద్యోగులు వినియోగించే ఉద్యోగుల భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్ఓ) ఆన్లైన్ సేవలు కొన్ని రోజుల పాటు అందుబాటులో ఉండవు. సిస్టమ్ అప్గ్రేడ్, డేటా మైగ్రేషన్ పనుల కారణంగా సభ్యుల పోర్టల్, యజమానుల పోర్టల్, ఉమంగ్ యాప్లోని పలు కీలక సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ఈపీఎఫ్వో ప్రకటించింది.
జూన్ 26 నుంచి 29 వరకు ఈ సేవలు నిలిచిపోనున్నాయి. ఈ కాలంలో పీఎఫ్ క్లెయిమ్లు దాఖలు చేయడం, క్లెయిమ్ ప్రాసెసింగ్, ఈ-పాస్బుక్ వీక్షించడం, కొత్త ఉద్యోగుల యూఏఎన్ లింకింగ్, ఈసీఆర్ ఫైలింగ్ వంటి సేవలు అందుబాటులో ఉండవు. సాంకేతిక మార్పుల ద్వారా మరింత వేగవంతమైన, సురక్షితమైన సేవలు అందించడమే దీని ఉద్దేశమని ఈపీఎఫ్వో తెలిపింది.
సేవలు జూన్ 30 నుంచి తిరిగి ప్రారంభమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది. అయితే ఉమంగ్ యాప్లో కనిపిస్తున్న సమాచారం ప్రకారం కొన్ని సేవలు జులై 2 వరకు అందుబాటులోకి వచ్చే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో సభ్యులు, యజమానులు తమ అవసరాలను ముందుగానే పూర్తి చేసుకోవాలని సూచించింది. ఏవైనా ఇబ్బందులు ఎదురైతే ఈపీఎఫ్వో హెల్ప్లైన్ 14470ను సంప్రదించాలని సంస్థ సూచించింది.
జూన్ 26 నుంచి 29 వరకు ఈపీఎఫ్వో ఆన్లైన్ సేవలు నిలిపివేత
