మోటరోలా భారత మార్కెట్లో కొత్త స్మార్ట్‌ఫోన్‌ ఎడ్జ్‌ 70 మ్యాక్స్‌ను విడుదల చేసింది. ఈ సిరీస్‌లో ఐదో మోడల్‌గా వచ్చిన ఈ ఫోన్‌ మూడు రంగుల్లో అందుబాటులోకి రానుంది. 8జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.54,999, 12జీబీ ర్యామ్‌ + 256జీబీ స్టోరేజ్‌ వేరియంట్‌ ధర రూ.59,999గా నిర్ణయించింది. కొన్ని బ్యాంకుల క్రెడిట్‌ కార్డులతో కొనుగోలు చేస్తే రూ.5,000 తక్షణ తగ్గింపు లభిస్తుంది. జులై 20 నుంచి ఫ్లిప్‌కార్ట్‌, మోటరోలా ఆన్‌లైన్‌ స్టోర్లలో విక్రయాలు ప్రారంభం కానున్నాయి.

ఈ ఫోన్‌లో 6.8 అంగుళాల క్యూహెచ్‌డీ+ ఎక్స్‌ట్రీమ్‌ అమోలెడ్‌ డిస్‌ప్లే ఇచ్చారు. 144Hz రిఫ్రెష్‌ రేట్‌, 7,000 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 360Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌, కార్నింగ్‌ గొరిల్లా గ్లాస్‌ 7ఐ రక్షణ అందించారు. ఆండ్రాయిడ్‌ 16 ఆధారిత 'హలో యూఐ'పై పనిచేసే ఈ ఫోన్‌కు మూడు సంవత్సరాల ఓఎస్‌ అప్‌డేట్లు, ఐదు సంవత్సరాల సెక్యూరిటీ అప్‌డేట్లు అందిస్తామని కంపెనీ ప్రకటించింది.

మరింత మెరుగైన పనితీరు కోసం 3 నానోమీటర్‌ స్నాప్‌డ్రాగన్‌ 8 జెన్‌ 5 ప్రాసెసర్‌ను అమర్చారు. గరిష్ఠంగా 12జీబీ ఎల్‌పీడీడీఆర్‌5ఎక్స్‌ ర్యామ్‌, 256జీబీ యూఎఫ్‌ఎస్‌ 4.1 స్టోరేజ్‌ అందించారు. వేడి తగ్గించే వేపర్‌ చాంబర్‌ కూలింగ్‌ సిస్టమ్‌, ఐపీ68, ఐపీ69 వాటర్‌, డస్ట్‌ రెసిస్టెన్స్‌ కూడా ఉన్నాయి.

ఫొటోగ్రఫీ కోసం వెనుకవైపు 50 మెగాపిక్సెల్‌ సోనీ ఎల్‌వైటీ-710 ప్రధాన కెమెరా, 8 మెగాపిక్సెల్‌ అల్ట్రావైడ్‌ కెమెరా ఇచ్చారు. సెల్ఫీల కోసం 32 మెగాపిక్సెల్‌ ఫ్రంట్‌ కెమెరా ఉంది. 4K 60fps వీడియో రికార్డింగ్‌కు మద్దతు ఇస్తుంది. 7,100mAh బ్యాటరీ, 90వాట్‌ వైర్డ్‌, 25వాట్‌ వైర్‌లెస్‌ ఫాస్ట్‌ ఛార్జింగ్‌, 5వాట్‌ రివర్స్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో ఈ ఫోన్‌ను తీసుకొచ్చింది.