ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్, E20 ఇంధన విధానంపై కేంద్ర ప్రభుత్వంతో ప్రత్యక్ష పోరుకు సిద్ధమయ్యారు. పెట్రోల్ బంకుల్లో వినియోగదారులకు స్వచ్ఛమైన పెట్రోల్, 20 శాతం ఇథనాల్ కలిపిన E20 పెట్రోల్ మధ్య ఎంచుకునే అవకాశం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ మేరకు ఆగస్టు 3వ తేదీన ప్రధాని నివాసానికి పాదయాత్ర చేపట్టనున్నట్లు ప్రకటించారు.
శనివారం ఢిల్లీలోని కానిస్టిట్యూషన్ క్లబ్ ఆఫ్ ఇండియాలో E20 ఇంధనంపై ఏర్పాటు చేసిన టౌన్ హాల్ సమావేశంలో కేజ్రీవాల్ ప్రసంగించారు. మంగళవారం మధ్యాహ్నం ప్రజల నుంచి పిటిషన్లు స్వీకరించి, సుమారు 100 మందితో కలిసి లోక్ కళ్యాణ్ మార్గ్ లోని ప్రధాని నరేంద్ర మోదీ నివాసానికి పాదయాత్రగా వెళ్లి వాటిని అందజేస్తామని తెలిపారు.
ఈ సందర్భంగా కేజ్రీవాల్ పలు కీలక డిమాండ్లు చేశారు. E20 పెట్రోల్ ధరను తగ్గించడంతో పాటు, సాధారణ పెట్రోల్ ధరలను కూడా తగ్గించాలని కోరారు. E20 వాడకం వల్ల వాహనాలకు ఎలాంటి నష్టం జరగదని కేంద్రం చెబుతోందని, ఆ వాదనకు ఆధారమైన అధ్యయన నివేదికను ప్రజల ముందు ఉంచాలని ఆయన సవాల్ విసిరారు. "కేంద్రం కొన్ని అధ్యయనాలు చేసిందని, E20 వల్ల వాహనాలకు హాని జరగదని చెబుతోంది. ఆ రిపోర్ట్ను మాతో పంచుకోవాలని నేను కోరుతున్నాను" అని కేజ్రీవాల్ అన్నారు.
E20 పెట్రోల్పై కేజ్రీవాల్ పోరుబాట.. ప్రధాని నివాసానికి పాదయాత్ర..
