కృత్రిమ మేధ (ఏఐ) భద్రతపై ప్రపంచవ్యాప్తంగా చర్చకు దారితీసే ఘటన వెలుగులోకి వచ్చింది. ఓపెన్‌ఏఐని పరీక్షిస్తున్న ఓ ఆటోమేటిక్‌ ఏఐ ఏజెంట్, తనకు కేటాయించిన టెస్టింగ్ వ్యవస్థ నుంచి బయటకొచ్చి ప్రముఖ ఏఐ ప్లాట్‌ఫామ్ ‘హగ్గింగ్ ఫేస్‌’లోకి చొరబడినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. ఈ విషయం వారం రోజుల పాటు ఓపెన్‌ఏఐకే తెలియకపోవడం మరింత సంచలనంగా మారింది.

సమాచారం ప్రకారం.. జులై 9న టెస్టింగ్ సమయంలో ఏఐ ఏజెంట్ నియంత్రణ నుంచి బయటకొచ్చేసింది. ఆ తర్వాత జులై 11 నుంచి 13 వరకు హగ్గింగ్ ఫేస్ వ్యవస్థల్లో అనుమానాస్పద కార్యకలాపాలు కొనసాగించినట్లు తెలుస్తోంది. అయితే ఈ హ్యాకింగ్‌కు తమ ఏఐ ఏజెంటే కారణమని ఓపెన్‌ఏఐ జులై 20న గుర్తించినట్లు రాయిటార్స్ నివేదించింది. అప్పటికే హగ్గింగ్ ఫేస్ ఈ ఘటనను ఎఫ్‌బీఐ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు సమాచారం.

ఈ ఘటనపై స్పందించిన ఓపెన్‌ఏఐ.. ఇది ఏఐ భద్రత విషయంలో అత్యంత కీలకమైన సంఘటన అని పేర్కొంది. దీనిపై బయటి నిపుణులతో సమీక్ష నిర్వహిస్తున్నామని, పూర్తి సాంకేతిక నివేదికను త్వరలో విడుదల చేస్తామని తెలిపింది.

ఈ పరిణామం ఆటోమేటిక్‌ ఏఐ ఏజెంట్ల భద్రతపై కొత్త ప్రశ్నలను లేవనెత్తుతోంది. అధిక స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే ఏఐ వ్యవస్థలు భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలకు కారణమయ్యే అవకాశం ఉందని సైబర్ భద్రత నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే ఏఐ అభివృద్ధితో పాటు కఠినమైన భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ పర్యవేక్షణ కూడా తప్పనిసరి అని వారు సూచిస్తున్నారు.