కృత్రిమ మేధ (ఏఐ)పై ప్రజల్లో నమ్మకం తగ్గిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగాలు పోతాయనే భయమేనని మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల అన్నారు. ఒక పాడ్కాస్ట్లో మాట్లాడిన ఆయన.. ‘‘ఏఐ వల్ల నాలెడ్జ్ ఆధారిత ఉద్యోగాలన్నీ పోతాయని ఒకవైపు చెబుతారు. మరోవైపు అదే టెక్నాలజీని అభివృద్ధి చేస్తున్నామని గర్వంగా ప్రకటిస్తున్నారు. అలాంటప్పుడు మీ విజయాన్ని ఎవరు కోరుకుంటారు?’’ అని వ్యాఖ్యానించారు.
ఏఐ రంగం గురించి మాట్లాడుతున్న తీరు వల్లే ప్రజల విశ్వాసం దెబ్బతిందని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. ఉద్యోగాలు కోల్పోతామనే ఆందోళన ప్రజల్లో బలపడిందని, అందుకే ఏఐపై అనుమానాలు పెరుగుతున్నాయని చెప్పారు. కాలేజీల్లో ఏఐ గురించి మాట్లాడితే వ్యతిరేక స్పందన రావడం కూడా ఈ పరిస్థితికి నిదర్శనమన్నారు.
ప్రజల విశ్వాసాన్ని తిరిగి పొందాలంటే ఏఐ వల్ల సమాజానికి ప్రత్యక్ష ప్రయోజనాలు కనిపించాల్సిన అవసరం ఉందని నాదెళ్ల సూచించారు. ఉదాహరణకు డేటా సెంటర్లు ఏర్పాటు చేస్తే స్థానిక ఉపాధి, పన్ను ఆదాయం, పాఠశాలలు, మౌలిక వసతుల వంటి రంగాలకు ఎలా మేలు జరుగుతుందో ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని అన్నారు.
ఏఐ మనుషుల ఉద్యోగాలను లాక్కోవడానికి కాకుండా, కొత్త ఉద్యోగ అవకాశాలను సృష్టించడానికి ఉపయోగపడాలని నాదెళ్ల అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో ఏయే కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయో గుర్తించడం, వాటికి తగిన వేతనాలు నిర్ణయించడంలో కూడా ఏఐ కీలక పాత్ర పోషించగలదని ఆయన తెలిపారు.
ఉద్యోగాలు పోతాయనే భయమే ప్రధాన కారణమని వివరణ: సత్య నాదెళ్ల..
