ఏపీలో ఎల్‌నినో ప్రభావం వల్ల నెలకొన్న వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా రైతులను తక్షణమే ఆదుకోవాలని సీపీఐ జాతీయ కార్యదర్శి కె. రామకృష్ణ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుని కోరారు. ఈ మేరకు మంగళవారం అమరావతిలోని సచివాలయంలో ఆయన ముఖ్యమంత్రిని కలిసి వినతిపత్రం అందజేశారు.

రాష్ట్రంలో నెలకొన్న కరువు పరిస్థితులను రామకృష్ణ ముఖ్యమంత్రికి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా 21 జిల్లాల్లో 54 శాతం లోటు వర్షపాతం నమోదైందని, 249 మండలాల్లో తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయని ఆయన పేర్కొన్నారు. దీనివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి ప్రత్యామ్నాయ పంటల సాగు కోసం అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే, రాష్ట్రంలో తాగునీటి ఎద్దడి తలెత్తకుండా ప్రభుత్వం తక్షణమే స్పందించి తగు చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు.

రామకృష్ణ విన్నపంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సానుకూలంగా స్పందించారు. ఎల్‌నినో ప్రభావంపై ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక దృష్టి సారించిందని ఆయన తెలిపారు. తాగునీటి సమస్య తలెత్తకుండా అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు చెప్పారు. ఆగస్టు 3వ తేదీ నుంచి రాష్ట్రవ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. రామకృష్ణ ప్రస్తావించిన సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం పూర్తిస్థాయిలో కృషి చేస్తుందని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.