తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులకు సుప్రీంకోర్టులో భారీ ఊరట లభించింది. పాలమూరు-రంగారెడ్డి, సీతమ్మ సాగర్, గౌరవెల్లి రిజర్వాయర్ వంటి కీలక ప్రాజెక్టుల పర్యావరణ అనుమతులపై నెలకొన్న సందిగ్ధతను తొలగిస్తూ సర్వోన్నత న్యాయస్థానం తాజాగా కీలక తీర్పును వెలువరించింది.

కేంద్ర పర్యావరణ, అటవీ శాఖ 2021లో జారీ చేసిన ఆఫీస్ మెమోరాండం (OM)ను సుప్రీంకోర్టు బుధవారం కొట్టివేసింది. అయితే, ఈ తీర్పు భవిష్యత్తు వ్యవహారాలకు మాత్రమే వర్తిస్తుందని జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం స్పష్టం చేసింది. సదరు మెమోరాండం ప్రాతిపదికన గతంలో మంజూరైన పర్యావరణ అనుమతులన్నీ యథాతథంగా చెల్లుబాటులో ఉంటాయని న్యాయస్థానం తేల్చిచెప్పింది.

సర్వోన్నత న్యాయస్థానం వెలువరించిన తాజా తీర్పుతో తెలంగాణలోని సాగునీటి ప్రాజెక్టులకు గతంలో లభించిన అనుమతులకు ఎటువంటి ఆటంకం లేదని స్పష్టమైంది. ముఖ్యంగా పాలమూరు-రంగారెడ్డి సహా ఇతర ప్రాజెక్టుల నిర్మాణానికి పర్యావరణ అనుమతుల రూపంలో ఎదురవుతున్న ప్రధాన అడ్డంకి దీంతో తొలగిపోయింది. ఈ పరిణామంతో సదరు ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వానికి మార్గం సుగమమైంది.