తెలుగు రాష్ట్రాల్లో మరోసారి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ముఖ్యంగా తెలంగాణలోని పలు జిల్లాల్లో గురువారం భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే ప్రమాదం ఉన్నందున, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. ఈ మేరకు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’ ప్రకటించింది.

వాతావరణ శాఖ అంచనాల ప్రకారం.. మంచిర్యాల, కరీంనగర్, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, జగిత్యాల, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, సిద్దిపేట జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అదే సమయంలో సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, వికారాబాద్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలకు ‘ఎల్లో అలర్ట్’ జారీ చేస్తూ, అక్కడ భారీ వర్షాలు నమోదవుతాయని వెల్లడించింది. ఇక హైదరాబాద్ మహానగరంలోనూ ఎడతెరిపి లేకుండా వర్షం కురిసే అవకాశాలు ఉన్నందున, నగరవాసులు అత్యవసరమైతే తప్ప బయటకు రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ (APSDMA) వెల్లడించింది. సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపిన వివరాల ప్రకారం.. పోలవరం, తూర్పు గోదావరి, ఏలూరు జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు వర్షాలు కురుస్తాయి. శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయన వివరించారు.