కాంతార’ చిత్రంతో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటుడు, దర్శకుడు రిషబ్ శెట్టికి అంతర్జాతీయ వేదికపై అరుదైన గౌరవం లభించింది. ఆస్ట్రేలియాలో నిర్వహించే ప్రతిష్టాత్మక ‘ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్’ (IFFM) 2026లో ఆయన ‘లీడర్‌షిప్ ఇన్ సినిమా’ పురస్కారానికి ఎంపికయ్యారు.

భారతీయ సంస్కృతి, సంప్రదాయాలను తన సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేసినందుకు గాను IFFM ఈ అవార్డుతో ఆయన్ను సత్కరించనుంది. ఆగస్టు 13న మెల్‌బోర్న్‌లో జరగనున్న వేడుకలో రిషబ్ శెట్టి ఈ పురస్కారాన్ని అందుకోనున్నారు.

ఈ గౌరవంపై రిషబ్ శెట్టి స్పందిస్తూ హర్షం వ్యక్తం చేశారు. “ఈ పురస్కారానికి ఎంపికవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను. మన సంస్కృతిని, మూలాలను ప్రతిబింబించే కథలకే నేను ఎప్పుడూ ప్రాధాన్యతనిస్తాను. ఇటువంటి కథలు ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడం సంతోషాన్నిస్తోంది. మెల్‌బోర్న్‌లో భారతీయ సినిమా వైవిధ్యాన్ని అందరితో కలిసి వేడుక చేసుకోవడానికి ఎదురుచూస్తున్నాను” అని రిషబ్ పేర్కొన్నారు.

ఇదిలా ఉండగా, రిషబ్ శెట్టి ప్రస్తుతం ఛత్రపతి శివాజీ మహారాజ్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రంలో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు.