స్నేహితులతో కలిసి ట్రిప్‌కి వెళ్లినా, పార్టీ చేసుకున్నా.. చివర్లో ఎవరు ఎంత ఖర్చు పెట్టారనే లెక్కలు తలనొప్పిగా మారతాయి. ఈ సమస్యకు పరిష్కారంగా ప్రముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం తమ యాప్‌లో 'స్ప్లిట్ బిల్స్' అనే కొత్త ఫీచర్‌ను తీసుకొచ్చింది. ఫ్రెండ్‌షిప్ డేకి ముందుగా అందుబాటులోకి తెచ్చిన ఈ ఫీచర్‌తో గ్రూప్ ఖర్చులను ట్రాక్ చేయడం, విభజించడం, సెటిల్ చేసుకోవడం చాలా సులభం కానుంది.

ముఖ్యంగా స్నేహితుల గ్రూపులు, కాలేజీ విద్యార్థులు, యువ ఉద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ఫీచర్‌ను రూపొందించినట్లు పేటీఎం తెలిపింది. రోడ్ ట్రిప్స్, పుట్టినరోజు వేడుకలు, సినిమా టికెట్లు, ఆన్‌లైన్ ఫుడ్ ఆర్డర్లు వంటి ఉమ్మడి ఖర్చులను సులభంగా నిర్వహించుకోవచ్చు. ఇందుకోసం పేటీఎం యాప్‌లో 'పే ఎనీవన్‌' సెక్షన్‌కి వెళ్లి 'స్ప్లిట్ బిల్స్' ఆప్షన్‌ను ఎంచుకోవాలి. అక్కడ కొత్త గ్రూప్ క్రియేట్ చేసి, స్నేహితులను యాడ్ చేసుకుని ఖర్చులను నమోదు చేయవచ్చు.

ఈ ఫీచర్ ద్వారా ఖర్చును సమానంగా, నిర్దిష్ట మొత్తం ప్రకారం లేదా వాటాల రూపంలో విభజించుకునే అవకాశం ఉంది. గ్రూప్‌లో మొత్తం ఎంత ఖర్చయింది, ఎవరి వాటా ఎంత, ఎవరు ఎంత చెల్లించాలనే వివరాలు స్పష్టంగా కనిపిస్తాయి. దీనికి ఎటువంటి పరిమితులు లేదా అదనపు ఛార్జీలు లేవని పేటీఎం స్పష్టం చేసింది.

ఇతర యాప్స్ చెల్లింపులనూ ట్రాక్ చేయొచ్చు
పేటీఎం యూపీఐ ద్వారా చేసిన చెల్లింపులే కాకుండా, ఇతర యూపీఐ యాప్స్, క్యాష్ లేదా కార్డుల ద్వారా చెల్లించిన మొత్తాలను కూడా ఇందులో నమోదు చేసుకోవచ్చు. ఇది ఈ ఫీచర్‌లోని అత్యంత ముఖ్యమైన సౌకర్యం. బకాయిలు చెల్లించాలని యాప్ నుంచే రిమైండర్లు పంపవచ్చు. "పంచుకున్న క్షణాలు గుర్తుండాలి కానీ, లెక్కలు కాదు. ఈ ఫీచర్‌తో ఆ లక్ష్యాన్ని చేరువ చేస్తున్నాం" అని పేటీఎం ప్రతినిధి ఒకరు తెలిపారు.