బాలీవుడ్ నటి, బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ మరోసారి వివాదాస్పద వ్యాఖ్యలతో వార్తల్లోకి ఎక్కారు. ఇటీవల జంతర్‌మంతర్ తదితర ప్రాంతాల్లో నిరసన తెలుపుతున్న జెన్-జీ యువతను ఉద్దేశించి ఆమె చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. నిరసనకారులను ‘గట్టర్ జనరేషన్’ అని సంబోధిస్తూ, వారి రీల్స్ వాంతులు తెప్పించేలా ఉన్నాయని, యువత స్వేచ్ఛను దుర్వినియోగం చేస్తోందని విమర్శించడంతో సోషల్ మీడియాలో తీవ్ర ఆగ్రహజ్వాలలు వ్యక్తమవుతున్నాయి.

 

ఈ వ్యవహారంపై నటుడు సోనూ సూద్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కంగనా ప్రవర్తనను తప్పుబడుతూ... ఒకవేళ ఆమె నిజంగానే ఆ వ్యాఖ్యలు చేసి ఉంటే అది అత్యంత సిగ్గుచేటని మండిపడ్డారు. నటులను, ప్రజాప్రతినిధులను స్టార్‌లుగా నిలబెట్టేది ఈ యువతేనని, మాట్లాడే ముందు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలని హితవు పలికారు.

 

"యువత మన వెన్నంటి ఉన్నంత కాలమే మన ఎదుగుదల ఉంటుంది. ప్రజలే దేవుళ్లు, అందరినీ కలుపుకుని పోవాలి. వారు లేకపోతే మనకు గుర్తింపు ఎక్కడిది? వృత్తి ఏదైనా ప్రజలతోనే కలిసి ఉండాలి" అని సోనూ సూద్ ఘాటుగా వ్యాఖ్యానించారు. ప్రస్తుతం సోనూ సూద్ చేసిన వ్యాఖ్యలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.