రాజకీయ వేదికలపై సాధారణంగా అధికారిక వాతావరణం, సీరియస్ ప్రసంగాలు కనిపిస్తాయి. కానీ, అప్పుడప్పుడు చోటుచేసుకునే కొన్ని సరదా సంఘటనలు అందరినీ ఆకట్టుకుంటాయి. తాజాగా ఆంధ్రప్రదేశ్ ఐటీ, విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు కార్తికేయ మధ్య జరిగిన ఓ ఆసక్తికర సంభాషణ ఇప్పుడు సోషల్ మీడియాలో నవ్వులు పూయిస్తోంది. ఈ ఘటనలో లోకేశ్ ప్రదర్శించిన హాస్య చతురత నెటిజన్లను విశేషంగా ఆకట్టుకుంటోంది.
కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని పునాదిపాడులో నూతనంగా నిర్మించిన మహిళా జూనియర్ కళాశాల ప్రారంభోత్సవ కార్యక్రమం దీనికి వేదికైంది. ఈ కళాశాల నిర్మాణానికి ఎస్.ఎస్. కార్తికేయ అత్తగారు, అర్ధాంగి భార్య పూజా ప్రసాద్ తల్లి విరాళం అందించారు. దీంతో ఈ కార్యక్రమానికి మంత్రి నారా లోకేశ్ తో పాటు కార్తికేయ, పూజా ప్రసాద్ దంపతులు ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లోకేశ్, అధికారిక ప్రసంగాల మధ్యలో వాతావరణాన్ని ఒక్కసారిగా తేలికపరిచారు. ఆయన చిరునవ్వుతో పూజా ప్రసాద్ వైపు తిరిగి.. "కార్తికేయ నిన్ను బాగా చూసుకుంటున్నాడా? ఏమైనా కంప్లైంట్స్ ఉన్నాయా? ఉంటే చెప్పు.. నేను ఉన్నాను కదా!" అని సరదాగా ప్రశ్నించారు. ఊహించని ఈ ప్రశ్నకు పూజా ప్రసాద్ నవ్వుతూ.. "లేదండీ.. ఎలాంటి కంప్లైంట్స్ లేవు" అని బదులిచ్చారు.
ఆ సమాధానం విన్న వెంటనే, మంత్రి లోకేశ్ పక్కనే ఉన్న కార్తికేయ వైపు తిరిగి, "బచ్ గయా!" అంటూ హిందీలో చమత్కరించారు. లోకేశ్ వ్యాఖ్యతో వేదికపై ఉన్నవారితో పాటు సభకు హాజరైన వారంతా ఒక్కసారిగా నవ్వేశారు. అధికారిక కార్యక్రమంలో చోటుచేసుకున్న ఈ ఊహించని మూమెంట్ అందరినీ ఆకట్టుకుంది.
ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది. రాజకీయాల్లో సీరియస్గా కనిపించే నారా లోకేశ్ లోని ఈ సరదా కోణాన్ని చూసి నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. కుటుంబ సభ్యులతో మాట్లాడినంత సహజంగా ఆయన సంభాషించిన తీరు బాగుందని కామెంట్లు చేస్తున్నారు. కాగా, ఎస్.ఎస్. కార్తికేయ ప్రస్తుతం తన తండ్రి రాజమౌళి భారీ చిత్రాల నిర్మాణంలో పాలుపంచుకుంటుండగా, ఆయన భార్య పూజా ప్రసాద్ గాయనిగా గుర్తింపు పొందారు.
'బచ్ గయా!'.. రాజమౌళి కుమారుడిని ఆటపట్టించిన మంత్రి లోకేశ్..
